భారత మహిళల బ్యాటింగ్‌ కోచ్‌గా శివ్‌ సుందర్‌ దాస్‌..

18 May, 2021 16:48 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ టెస్టు ఆటగాడు శివ్‌ సుందర్‌ దాస్‌ ఎంపికయ్యాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్‌ పర్యటన కోసం దాస్‌ను బీసీసీఐ నియమించింది. గత కొన్నేళ్లుగా జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి కోచ్‌గా పని చేస్తున్న అతను.. 2020లో పట్నాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో భారత మహిళల ‘ఎ’ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఈ అనుభవంతో అతనికి జాతీయ జట్టుకు సేవలందించే అవకాశం దక్కింది.

కాగా, ఒడిశాకు చెందిన శివ్‌ సుందర్‌ దాస్‌ 2000–2002 మధ్య కాలంలో భారత్‌ తరఫున ఓపెనర్‌గా 23 టెస్టులు ఆడి 34.89 సగటుతో 2 సెంచరీలు సహా 1326 పరుగులు చేశాడు. అతను 4 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. మహిళల జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా అభయ్‌ శర్మను ఎంపిక చేసిన బోర్డు...బరోడాకు చెందిన రాజ్‌కువర్‌దేవి గైక్వాడ్‌ను మేనేజర్‌గా నియమించింది. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా భారత్‌ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో  ఆడనుంది.   
చదవండి: టీమిండియా బంగ్లా పర్యటన ఖరారు

మరిన్ని వార్తలు