న్యూజిలాండ్‌పై విరుచుకుపడిన పాక్‌ మాజీ క్రికెటర్లు

17 Sep, 2021 21:06 IST|Sakshi

Shoaib Akhtar And Shahid Afridi Slams New Zealand Cricket Board: పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్‌ జట్టు తొలి వన్డేకు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్‌ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ సెక్యూరిటీ విభాగం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. భద్రతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో కివీస్ క్రికెటర్లు హోటల్ రూముల నుంచి బయటకు రాలేదు. ప్రస్తుతం వారు స్వదేశానికి తిరుగుటపా కట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భద్రత విషయమై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖానే స్వయంగా న్యూజిలాండ్‌ క్రికెటర్లకు భరోసా ఇచ్చినప్పటకీ వారు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ జట్టుపై పాక్‌ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు

సెక్యూరిటీ హెచ్చరిక లేదు.. ఏదీ లేదు.. అదంతా వట్టి డ్రామా.. హామీ ఇచ్చినా సిరీస్‌ను రద్దు చేసుకోవడం దారుణమని షాహిద్‌ అఫ్రిది మండిపడగా, ఆ దేశ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్ అక్తర్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. "పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది" అంటూ కోపంగా ఉన్న ఎమోజీలతో ట్వీట్ చేశాడు. కాగా, సిరీస్ రద్దవ్వడంపై న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. "సిరీస్‌ రద్దు పాక్‌ క్రికెట్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలుసు. పీసీబీ అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్​ తెలిపారు. ఇదిలా ఉంటే, పాక్‌ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉండింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పర్యటన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా నేడు రావల్పిండి వేదికగా తొలి వన్డే జరగాల్సింది.


చదవండి: కోహ్లి వారసుడిగా రోహిత్‌తో పోలిస్తే అతనైతేనే బెటర్‌.. ఎందుకంటే..?

>
మరిన్ని వార్తలు