'ఛీ.. స్కూల్‌ లెవల్‌ కన్నా దారుణం'

5 Jan, 2021 19:48 IST|Sakshi

క్రైస్ట్‌చర్చి : పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పీసీబీపై తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో పాక్‌ ఆటతీరును విమర్శిస్తూ పీసీబీని ఎండగట్టాడు. పాక్‌ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ట్విటర్‌లో ఒక వీడియోనూ షేర్‌ చేశాడు.

'పాకిస్తాన్‌ ఆటతీరు స్కూల్‌ లెవెల్‌ కన్నా దారుణంగా ఉంది. పీసీబీ విధానాలు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. యావరేజ్‌గా ఆడే ఆటగాళ్లను టెస్టు జట్టుకు ఎంపిక చేయడం పీసీబీకే చెల్లింది. యావరేజ్‌ జట్టుగా ఉంది కాబట్టే ఫలితాలు కూడా యావరేజ్‌గానే వస్తాయి.. అయినా పాక్‌ జట్టు ఎప్పుడు టెస్టు మ్యాచ్‌ ఆడినా ఇలాంటి ఆటతీరునే ప్రదర్శిస్తుంది.వీరికన్నా క్లబ్‌ క్రికెట్‌ ఆడేవాళ్లు నయం. నిజానికి పాక్‌ ఆటతీరు స్కూల్‌ లెవెల్ క్రికెట్‌కు పడిపోవడానికి పీసీబీయే పరోక్షంగా కారణం.అయితే పీసీబీ ఇప్పుడు మేనేజ్‌మెంట్‌ను మార్చాలని చూస్తుంది. ఇది జరిగితే మంచిదే.. కానీ ఎప్పుడు మేనేజ్‌మెంట్‌ను మారుస్తుందనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయిందంటూ 'అక్తర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. (చదవండి: పాపం టీ20 తరహాలో ఆడాడు.. ట్విస్ట్‌ ఏంటంటే)


కాగా రెండో టెస్టులో కివీస్‌ బౌలర్‌ ఖైల్‌ జేమిసన్‌ దాటికి పాక్‌ జట్టు 297 పరుగులకే ఆలౌట్‌ అయింది. రిజ్వాన్‌ 61 పరుగులతో రాణించడం మినహా మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్‌ భారీ స్కోరు నమోదు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ డబుల్‌ సెంచరీతో అదరగొట్టడంతో తన మొదటి ఇన్నింగ్స్‌ను 659 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. విలియమ్సన్‌కు తోడుగా హెన్రీ నికోలస్‌ 157 పరుగులు, డారెల్‌ మిచెల్‌ 102 పరుగులతో విజృంభించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్‌ ఒక వికెట్‌ నష్టానికి 8 పరుగులు చేసి మూడోరోజు ఆటను ముగించింది. పాక్‌ ఆటతీరు చూస్తుంటే ఇన్నింగ్స్‌ పరాజయం దిశగా కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది.(చదవండి: 'ఆ మ్యాచ్‌ ఆడేందుకు త్యాగాలకు కూడా సిద్ధం')

మరిన్ని వార్తలు