డబ్బులు ఇవ్వమన్నందుకు సుశీల్‌ నన్ను చితకబాదాడు

30 May, 2021 16:50 IST|Sakshi

ముంబై: జూనియర్‌ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌ కుమార్‌ మెడకు మరో కేసు మెడకు చుట్టుకునేలా ఉంది. ఇప్పటికే మర్డర్‌ కేసులో అరెస్టైన సుశీల్‌కు ఢిల్లీ రోహిణి కోర్టు శనివారం మరో నాలుగు రోజల రిమాండ్‌ పొడిగించింది. తాజాగా సుశీల్‌ కుమార్‌ ఒక కిరాణా షాప్‌ ఓనర్‌ను బెదిరించడంతో పాటు అతనిపై దాడికి దిగి దౌర్జన్యానికి పాల్పడినట్లు సతీశ్‌ యాదవ్‌ ఇండియా టుడే ఇంటర్య్వూలో తెలిపారు.

సతీష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. '' నేను 18 సంవత్సరాలుగా ఛత్రసాల్‌ స్టేడియానికి సరుకులు అందిస్తున్నా. సుశీల్‌ మామ సత్పాల్‌ సింగ్‌ ఛత్రసాల్‌ స్టేడియంలో కోచ్‌గా ఉన్న సమయంలో నాకు అతనితో మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగా తక్కువ ధరకే సరుకులు అందిస్తుండేవాడిని. కాగా  గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో స్డేడియానికి కోచ్‌గా ఉన్న బీరేంద్ర సరుకుల అందించాలని కోరాడు. అతని ఆర్డర్‌పై  నేను రేషన్‌ అందించాను. అయితే బీరేంద్ర ట్రాన్స్‌ఫర్‌ కావడం... అతని స్థానంలో కొత్త కోచ్‌ వచ్చాడు.

నాకు రావాల్సిన రూ. 4 లక్షలు ఇవ్వాలని ఛత్రసాల్‌ కొత్త కోచ్‌ అశోక్‌ను అడిగాను. ఒకరోజు అశోక్‌ నన్ను పిలిచి డబ్బు చెల్లిస్తానని బిల్లులు తీసుకున్నాడు. మరునాడు ధర్మ అనే వ్యక్తి  వచ్చి సుశీల్‌ కుమార్‌  మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి వెళ్లాడు. డబ్బు ఇస్తారనే ఆశతో అ‍క్కడికి వెళ్లిన నాకు సుశీల్‌ డబ్బు ఇవ్వనని చెప్పడంతో అతని కాళ్ల మీద పడి మీరు డబ్బు ఇవ్వకపోతే ఇక్కడే చచ్చిపోతా అని అన్నాను. దానికి సుశీల్‌ ''అవునా.. ఇక్కడే చచ్చిపోతావా.. అయితే చావు'' అంటూ తన అనుచరులను పిలిచి ఇష్టం వచ్చినట్లు కొట్టించి దౌర్జన్యం చేశాడు. మళ్లీ కనిపిస్తే చంపేస్తానని బెదరించడంతో భయంతో ఇంటికి వెళ్లిపోయాను.'' అని చెప్పుకొచ్చాడు. కాగా సతీష్‌ యాదవ్‌ తనపై దాడి చేసిన సుశీల్‌ బృందంపై గత సెప్టెంబర్‌లో ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. తాజాగా సుశీల్‌ హత్య కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెలుసుకున్న సతీష్‌ యాదవ్‌ తనపై దాడికి దిగిన సుశీల్‌పై మరోసారి ఫిర్యాదు చేస్తానని తెలిపాడు.
చదవండి: రెజ్లర్‌ హత్యకేసు: సుశీల్‌ కుమార్‌ రిమాండ్‌ పొడిగింపు

మరిన్ని వార్తలు