శ్రేయస్‌ అయ్యర్‌ మరో సెంచరీ

28 Feb, 2021 14:32 IST|Sakshi

ఎదురులేని ముంబై

వరుసగా నాలుగో విజయం

జైపూర్‌: దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన ముంబై జట్టు... దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో మాత్రం అదరగొడుతోంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో ఉన్న ముంబై జట్టు వరుసగా నాలుగో విజయం సాధించి నాకౌట్‌ దశకు చేరువైంది. రాజస్తాన్‌ జట్టుతో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ముంబై 67 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 317 పరుగులు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (103 బంతుల్లో 116; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి ఈ టోర్నీలో రెండో సెంచరీ చేశాడు.  ఇక్కడ చదవండి: ‘పిచ్‌ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలి’

318 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగిన రాజస్తాన్‌ 42.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. మహిపాల్‌ (69 బంతు ల్లో 76; 6 ఫోర్లు, 4 సిక్స్‌ లు) మెరుపు ఇన్సింగ్స్‌ ఆడాడు. ముంబై పేసర్లు శార్దుల్‌ ఠాకూర్‌ (4/50), ధవళ్‌ కులకర్ణి (3/26) రాజస్తాన్‌ను దెబ్బతీశారు. ఇతర మ్యాచ్‌ల్లో సౌరాష్ట్ర 62 పరుగుల తేడాతో చండీగఢ్‌పై; బెంగాల్‌ 82 పరుగుల తేడాతో జమ్మూ కశ్మీర్‌ జట్టుపై; పుదుచ్చేరి 104 పరుగుల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌పై; ఢిల్లీ మూడు వికెట్ల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందాయి. 


 

మరిన్ని వార్తలు