-

Shreyas Iyer: సర్జరీ సక్సెస్‌... టీమిండియాకు గుడ్‌న్యూస్‌! మెగా టోర్నీకి అందుబాటులోకి!

21 Apr, 2023 13:26 IST|Sakshi

Shreyas Iyer - Back Surgery: టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు సర్జరీ విజయవంతమైంది. వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన అతడు చికిత్స కోసం లండన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం శ్రేయస్‌కు సర్జరీ జరిగినట్లు సమాచారం. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌ తొలి మ్యాచ్‌కు దూర​మైన అయ్యర్‌ రెండో టెస్టుకి అందుబాటులోకి వచ్చాడు.

కానీ.. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో మూడో మ్యాచ్‌ మధ్యలోనే జట్టు నుంచి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు పూర్తిగా దూరమైన అయ్యర్‌ ఐపీఎల్‌-2023 సీజన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో సర్జరీ కోసం లండన్‌ వెళ్లిన అతడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనంలో వెల్లడించింది. 

కాగా అయ్యర్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరో మూడు నెలల సమయం పట్టనుంది. దీంతో ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అయ్యర్‌ దూరం కావడం ఖాయంగా తెలుస్తోంది. అయితే, అక్టోబరులో భారత్‌ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీకి మాత్రం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కాగా ఈ 28 ఏళ్ల ఈ ముంబై బ్యాటర్‌ అయ్యర్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథిగా ఉన్నాడు. అతడి గైర్హాజరీలో నితీశ్‌ రాణా ప్రస్తుతం కేకేఆర్‌ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. రాణా నేతృత్వంలో కేకేఆర్‌ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. దీంతో అయ్యర్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: ఒకప్పుడు టీమిండియా కెప్టెన్‌.. ఇప్పుడు పోలీస్‌ ఆఫీసర్‌!
చెన్నైతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ జట్టులో కీలక మార్పు! యార్కర్ల కింగ్‌కు నో ఛాన్స్‌

మరిన్ని వార్తలు