'క్రికెటర్‌ కాకపోయుంటే రైతు అయ్యేవాడు'

3 Dec, 2020 14:28 IST|Sakshi

ఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు మద్దతు ఇస్తుంటే కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. (చదవండి : వైరలవుతున్న నటరాజన్‌ ఎమోషనల్‌ వీడియో)

తాజాగా టీమిండియా క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ కుటుంబం రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు గిల్‌ తండ్రి లఖ్వీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. కాగా గిల్‌ ఆసీస్‌ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం ఆసీస్‌, ఇండియా మధ్య జరిగిన మూడో వన్డేలో ఓపెనర్‌గా వచ్చి  33 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.  టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్వీందర్‌ సింగ్‌ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.

'నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. నా తండ్రి రైతులు చేస్తున్న ఆందోళనలో పాల్గొంటానని ఇంట్లో నుంచి బయలుదేరారు. కానీ ఆయన ఆరోగ్యం దృశ్యా ఒకసారి ఆలోచించమని చెప్పిన తర్వాత తన ఆలోచనను విరమించుకున్నారు. మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. గిల్‌ చిన్ననాటి నుంచే వ్యవసాయం అంటే ఎంతో మక్కువ చూపించేవాడు. తాతలు, మామల దగ్గర్నుంచి వ్యవసాయం అంటే ఎంటో ప్రత్యక్షంగా నేర్చుకున్నాడు. (చదవండి : ‘251 మ్యాచ్‌ల్లో 103 సార్లు’)

గిల్‌కు సొంతూరంటే చెప్పలేనంత ఇష్టం..  ఎక్కువగా పంట పొలాల్లోనే తన ప్రాక్టీస్‌ను కొనసాగించేవాడు. ఒకవేళ గిల్‌  క్రికెటర్‌ కాకపోయుంటే మాత్రం ..రైతు అయ్యేవాడని కచ్చితంగా పేర్కొంటా. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఊళ్లో ఉన్న వ్యవసాయక్షేత్రానికి వెళ్లిపోతానని గిల్‌ చాలా సందర్భాల్లో నాతో చెప్పుకొచ్చాడు.  ఇప్పుడు నా కొడుకు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గిల్‌ ఆటను ఒక పక్క టీవీలో ఎంజాయ్‌ చేస్తూనే రైతుల ఉద్యమానికి మా వంతు సంఘీబావం ప్రకటించాం. మేము రైతులకు ఇస్తున్న మద్దతును గిల్‌ తప్పకుండా అర్థం చేసుకుంటాడనే భావిస్తున్నా.. అంటూ'  లఖ్వీందర్‌ సింగ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు