'వారిద్దరి నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నా'

25 May, 2021 19:46 IST|Sakshi

ముంబై: టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ గతేడాది ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన నమోదు చేశాడు. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో 91 పరుగుల ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలా చారిత్రాత్మక సిరీస్‌ విజయంలో భాగమయిన గిల్‌ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ పాల్గొన్నాడు. అయితే ఆ సిరీస్‌లో గిల్‌ అంతగా ఆకట్టుకోలేకపోయిన.. అతని ఆటపై నమ్మకముంచిన బీసీసీఐ కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేసింది. మయాంక్‌ అగర్వాల్‌తో పోటీ ఉన్నా.. రోహిత్‌ శర్మకు జతగా గిల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సీనియర్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నట్లు గిల్‌ పేర్కొన్నాడు. '' విరాట్ కోహ్లితో ఎప్పుడు మాట్లాడినా.. బెరుకు లేకుండా ఎలా ఆడాలో చెప్తుంటాడు. అలానే బ్యాటింగ్‌కి వెళ్లేటప్పుడు పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండాలని సూచించేవాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఎలా ఆడాలో నేర్పిస్తుంటాడు. మైదానంలో తెగించి ఆడాల్సిన సందర్భాల్ని కూడా రోహిత్ శర్మ గుర్తు చేసేవాడు. ప్రత్యర్థి బౌలర్లు ఏ ప్రదేశంలో ఎక్కువ బంతులు వేస్తున్నారు..? అనే దానిపై రోహిత్ శర్మ ఎక్కువగా మైదానంలో మాట్లాడుతుండేవాడు'' అని చెప్పుకొచ్చాడు. కాగా 2019లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన గిల్‌ 7 టెస్టుల్లో 378 పరుగులు.. 3 వన్డేల్లో 49 పరుగులు సాధించాడు.
చదవండి: ఎవరీ కుర్రాడు.. రేపటి టెస్టు మ్యాచ్‌లో ఆడిద్దామా!

England Tour: ‘బయో బబుల్‌’లోకి కోహ్లి, రోహిత్‌

మరిన్ని వార్తలు