IPL 2022: శుభ్‌మాన్‌ గిల్ విధ్వంసం.. 4 సిక్స్‌లు, 6 ఫోర్లు.. టీ20ల్లో టాప్‌ స్కోర్‌!

3 Apr, 2022 18:36 IST|Sakshi

ఐపీఎల్‌-2022లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ శుబ్‌మాన్‌ గిల్ చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లో 84 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 సిక్స్‌లు, 6 ఫోర్లు ఉన్నాయి. కాగా టీ20ల్లో గిల్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం గమనార్హం. అంతకుముందు 2019 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబైపై 78 పరుగులు గిల్‌ సాధించాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై  14 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించింది.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో పంత్‌ (43),  రోవ్‌మెన్‌ పావెల్‌ (20), లలిత్‌ యాదవ్‌(26) పరుగులతో టాప్‌స్కోరర్‌లుగా నిలిచారు. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 4, షమీ 2, హార్దిక్‌ పాండ్యా, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ 84 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్‌ పాండ్యా 31, డేవిడ్‌ మిల్లర్‌ 20 పరుగులతో రాణించారు.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో తిలక్‌ వర్మ కొత్త రికార్డు.. తొలి ముంబై ఆటగాడిగా

మరిన్ని వార్తలు