Singapore Open 2022: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సింధు

16 Jul, 2022 12:06 IST|Sakshi

సింగపూర్‌ ఓపెన్‌ 2022 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు దూసుకుపోతుంది. శనివారం (జులై 16) జరిగిన సెమీఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి, వరల్డ్‌ 38వ ర్యాంకర్‌ సయినా కవకామిపై 21-15, 21-7తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. తొలి సెట్‌ నుంచే ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. కేవలం 32 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించింది. ఈ ఏడాది రెండు సూపర్‌ 300 టైటిల్స్‌ (సయ్యద్‌ మోదీ, స్విస్‌ ఓపెన్‌) సాధించిన సింధు.. సింగపూర్‌ ఓపెన్‌ గెలిచి తొలి సూపర్‌ 500 టైటిల్‌ సాధించాలని ఉవ్విళ్లూరుతుంది.

డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ అయిన సింధు.. క్వార్టర్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ హాన్‌ యుయేపై 17-21, 21-11, 21-19 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కెరీర్‌లో దాదాపు అన్ని సూపర్‌ 500 టైటిల్స్‌ సాధించిన సింధు సింగపూర్‌ ఓపెన్‌ మాత్రం గెలవలేకపోయింది. దీంతో సింధు ఈసారి ఎలాగైనా ఈ టైటిల్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుత టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించిన సహచర షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ప్రొఫెషనల్‌గా మారకముందే 2010లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచింది.
చదవండి: Singapore Open 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు.. సైనాకు తప్పని భంగపాటు

>
మరిన్ని వార్తలు