లబుషేన్, స్మిత్‌ సెంచరీలు

9 Jul, 2022 03:11 IST|Sakshi

గాలె: శ్రీలంకతో శుక్రవారం మొదలైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 298 పరుగులు సాధించింది. మార్నస్‌ లబుషేన్‌ (156 బంతుల్లో 104; 12 ఫోర్లు), స్టీవ్‌ స్మిత్‌ (212 బంతుల్లో 109 బ్యాటింగ్‌; 14 ఫోర్లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 134 పరుగులు జోడించారు.

లబుషేన్‌ వ్యక్తిగత స్కోరు 28 వద్ద శ్రీలంక కీపర్‌ డిక్‌వెల్లా స్టంపింగ్‌ అవకాశాన్ని వదిలేశాడు. ఉస్మాన్‌ ఖాజా (37; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... వార్నర్‌ (5), ట్రావిస్‌ హెడ్‌ (12), కామెరాన్‌ గ్రీన్‌ (4) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. ప్రస్తుతం స్మిత్‌తో కలిసి అలెక్స్‌ క్యారీ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య మూడు వికెట్లు తీయగా, కాసున్‌ రజిత, రమేశ్‌ మెండిస్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో కామిందు మెండిస్, మహీశ్‌ తీక్షణ, ప్రభాత్‌ జయసూర్య టెస్టుల్లో అరంగేట్రం చేశారు.   

మరిన్ని వార్తలు