SL VS PAK 2nd Test: టెస్ట్‌ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్‌

24 Jul, 2022 16:16 IST|Sakshi

టెస్ట్‌ క్రికెట్‌లో శ్రీలంక స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గాలే వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ ద్వారా మాథ్యూస్‌ వంద టెస్ట్‌ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో లంక తరఫున 100 టెస్ట్‌లు ఆడిన ఆరో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మాథ్యూస్‌కు ముందు మహేళ జయవర్ధనే (149), సంగక్కర (134), మురళీథరన్‌ (133), చమింద వాస్‌ (111), జయసూర్య (110) మాత్రమే లంక తరఫున వంద టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడారు.

పాక్‌తో రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల వద్ద ఔటైన మాథ్యూస్‌ ఇప్పటివరకు ఆడిన 100 టెస్ట్‌ల్లో 45.2 సగటున 13 సెంచరీలు, 38 అర్ధసెంచరీల సాయంతో 6918 పరుగులు చేశాడు. భుజం గాయం కారణంగా టెస్ట్‌ల్లో బౌలింగ్‌ చేయడం మానేసిన మాథ్యూస్‌.. టెస్ట్‌ కెరీర్‌లో 33 వికెట్లు పడగొట్టాడు. 35 ఏళ్ల మాథ్యూస్‌ ఇప్పటికీ వన్డేల్లో, టీ20ల్లో లంక జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉంటే, పాక్‌తో రెండో టెస్ట్‌ ద్వారా అరుదైన మైలురాయిని చేరుకున్న మాథ్యూస్‌.. దీంతో పాటు పలు అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకున్నాడు.

  • ప్రస్తుతం టెస్ట్‌ క్రికెట్‌ ఆడుతున్న వారిలో 100 టెస్ట్‌ల మార్కును అందుకున్న ఏడో ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు.
  • జేమ్స్ అండర్సన్ (172), స్టువర్ట్ బ్రాడ్ (156), జో రూట్ (121), నాథన్ లయన్ (110), ఇషాంత్ శర్మ (105), విరాట్ కోహ్లి (102) మాథ్యూస్‌కు ముందు 100 టెస్ట్‌లు ఆడారు.
  • 2009లో పాకిస్తాన్‌పై టెస్ట్‌ ఆరంగ్రేటం చేసిన  మాథ్యూస్.. తన 25వ, 50వ, 100వ టెస్ట్‌ మ్యాచ్‌లను అదే ప్రత్యర్థిపై ఆడాడు
  • కెరీర్‌లో తొలి టెస్ట్‌, 100వ టెస్ట్‌ ఒకే వేదికపై (గాలే), ఒకే ప్రత్యర్ధిపై (పాక్‌) ఆడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మాథ్యూస్‌కు ముందు ఈ ఫీట్‌ను విండీస్‌ ఆటగాడు కార్ల్‌ హూపర్‌ సాధించాడు. హూపర్‌.. భారత్‌పై ముంబై వేదికగా తొలి, 100వ టెస్ట్‌లను ఆడాడు.
    చదవండి: క్రికెట్‌ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..?
మరిన్ని వార్తలు