SMAT 2022: ఐదేసిన సిద్ధార్థ్‌ కౌల్‌.. పంజాబ్‌ ఘన విజయం

20 Oct, 2022 17:41 IST|Sakshi

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2022 ఎలైట్‌ గ్రూప్‌-బిలో పంజాబ్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. జైపూర్‌ వేదికగా పుదుచ్చేరితో ఇవాళ (అక్టోబర్‌ 20) జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన పంజాబ్‌.. 20 పాయింట్లు సాధించి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. 

పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన పంజాబ్‌.. ప్రత్యర్ధిని కేవలం 86 పరుగులకే కట్టడి చేసింది. వెటరన్‌ పేసర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ (5/12) ఐదు వికెట్లతో చెలరేగడంతో పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. సిద్దార్థ్‌కు జతగా బల్తేజ్‌ సింగ్‌ (1/17), హర్ప్రీత్‌ బ్రార్‌ (1/16), మార్కండే (2/17) రాణించారు. పుదుచ్చేరి ఇన్నింగ్స్‌లో పరమేశ్వరన్‌ శివరామన్‌ (25), అంకిత్‌ శర్మ (23), అరుణ్‌ కా​ర్తీక్‌ (15) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌.. కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్‌ శర్మ (29), శుభ్‌మన్‌ గిల్‌ (21), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (23 నాటౌట్‌), హర్ప్రీత్‌ బ్రార్‌  (13 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్‌ ఉదేషికి ఓ వికెట్‌ దక్కింది.    
 

Poll
Loading...
మరిన్ని వార్తలు