IND W Vs ENG W: స్మృతి మందాన మెరుపులు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం

14 Sep, 2022 07:31 IST|Sakshi

భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. డెర్బీ వేదికగా మంగళవారం ఇంగ్లండ్‌ మహిళలతో జరిగిన రెండో టి20లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఉమెన్స్‌ 16.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్స్‌లో స్మృతి మందాన (53 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 79 పరుగులు నాటౌట్‌) మెరుపులు మెరిపించగా.. చివర్లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 22 బంతుల్లో 29 పరుగులు నాటౌట్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ ఉమెన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఫ్రెయా కెంప్‌ (37 బంతుల్లో 51 పరుగులు నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఎం.బౌచిర్‌ 34 పరుగులు చేసింది. టీమిండియా మహిళల్లో స్నేహ్‌ రాణా 3 వికెట్లతో మెరవగా.. దీప్తి శర్మ, రేణుక సింగ్‌ చెరొక వికెట్‌ తీశారు.

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక నిర్ణయాత్మక మూడో టి20 సెప్టెంబర్‌ 15(గురువారం) జరగనుంది. ఆ తర్వాత భారత్‌, ఇంగ్లండ్‌లు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి.

మరిన్ని వార్తలు