స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్‌: సోనూ సూద్‌కు అరుదైన గౌరవం

2 Aug, 2021 14:22 IST|Sakshi

స్పెషల్‌ ఒలింపిక్స్‌లో ఇండియాకు సోనూ సూద్‌ నాయకత్వం

ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: సోనూ సూద్‌

సాక్షి,ముంబై: రియల్‌ హీరో, బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ కు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది రష్యాలో జరిగే స్పెషల్ ఒలింపిక్స్ లో భాగంగా భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. దీనిపై సోనూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజని, స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌ బృందంతో చేరడం తనకు గర్వంగా ఉందన్నారు.  ఈ సందర్బంగా ఎస్‌వో భారత్‌ జట్టుకు​ ముందస్తు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

రష్యాలోని కజాన్‌  వేదికగా వచ్చే ఏడాది జనవరి 22 నుంచి స్పెషల్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ జరుగనున్నాయి. ఈ వింటర్ ఒలింపిక్స్‌కు హాజరయ్యే భారతదేశం అథ్లెట్ల బృందానికి సోనూ నాయకత్వం వహించ నున్నారు.  అటు ఈ పరిణామంపై ప్రత్యేక ఒలింపిక్స్ భారత్ ఛైర్‌పర్సన్ డాక్టర్ మల్లికా నడ్డా సంతోషం ప్రకటించారు. ప్రత్యేక ఒలింపిక్స్ కుటుంబంలో చేరేందుకు తమ ఆహ్వానాన్ని మన్నించిన సోనూ సూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నాడని నమ్ముతున్నామన్నారు.  

కాగా కరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ సంక్షోభంలో వలస కూలీలకు అండగా నిలిచిన సోనూ సూద్‌ రియల్‌ హీరోగా అవతరించారు. ఇక అప్పటినుంచి విద్యార్థులకు అండగా ఉంటూ వచ్చిన ఆయన తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌లో అనేకమంది బాధితులకు అండగా నిలిచారు. 

మరిన్ని వార్తలు