IPL 2023-Rishabh Pant: పంత్‌ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు

11 Jan, 2023 12:33 IST|Sakshi

Rishabh Pant- IPL 2023- Delhi Capitals: టీమిండియా యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ఐపీఎల్‌-2023 సీజన్‌ మొత్తానికి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టనున్న సౌరవ్‌ గంగూలీ వెల్లడించాడు. కాగా గతేడాది డిసెంబరు 30న జరిగిన ఘోర కారు ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడ్డ విషయం విదితమే.

ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ పొందిన 25 ఏళ్ల ఈ యువ వికెట్‌ కీపర్‌ను.. మెరుగైన చికిత్స కోసం బీసీసీఐ ముంబై తరలించింది. అక్కడే కోకిలాబెన్‌ అంబానీ హాస్పిటల్‌లోని ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో పంత్‌కు చికిత్స జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో అతడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి గంగూలీ కీలక అప్‌డేట్‌ అందించాడు. ‘‘తను కోలుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనమేం చేయలేము. అదొక దురదృష్టకర ఘటన. 

చిన్న వయసులో తనకిలా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి రిషభ్‌ పంత్‌ అందబాటులో ఉండడు. నేను ఢిల్లీ క్యాపిటల్స్‌తో కాంటాక్ట్‌లో ఉన్నాను. త్వరలోనే మీకో విషయం తెలుస్తుంది. పంత్‌ లేని లోటు కచ్చితంగా ప్రభావం చూపుతుంది.

అయితే, ఎక్కడా వెనుకడుగు వేసేది లేదు. మాకిది గొప్ప సీజన్‌ కాబోతోందనడంలో సందేహం లేదు’’ అని గంగూలీ పేర్కొన్నాడు. కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడిన అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రిషభ్‌ పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి ఆఖరి వారం లేదంటే ఏప్రిల్‌ తొలి వారంలో ఐపీఎల్‌ మొదలుకానున్న తరుణంలో పంత్‌ ఈ ఎడిషన్‌కు దూరం కానున్నాడు. ఇదిలా ఉంటే.. పంత్‌ చికిత్సకయ్యే ఖర్చు మొత్తాన్ని బీసీసీఐ భరిస్తోంది.

బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్‌ అయిన ఈ వికెట్‌ కీపర్‌ ఏడాదికి 5 కోట్ల జీతం అందుకుంటున్నాడు. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా 16 కోట్లు ఆర్జిస్తున్నాడు. అయితే, ఈ విపత్కర సమయంలో పంత్‌ ఆటకు దూరమైనా అతడికి జీతం చెల్లించే విధంగా బీసీసీఐ చర్యలు చేపట్టడం విశేషం. ఇక పంత్‌ జట్టుకు దూరమైన నేపథ్యంలో డేవిడ్‌ వార్నర్‌ ఢిల్లీ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.

చదవండి: Kohli- Pandya: పాండ్యాపై గుడ్లురిమిన కోహ్లి! సెంచరీ మిస్‌ అయ్యేవాడే! వీడియో వైరల్‌
WTC: భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. మూడున్నరేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ

మరిన్ని వార్తలు