ఒలింపిక్స్‌ జెర్సీల‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి

3 Jun, 2021 18:38 IST|Sakshi

న్యూఢిల్లీ: జులై 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ కోసం భార‌త అథ్లెట్లు స‌న్నద్దం అవుతున్నారు. ఈ క్రమంలో నేడు(గురువారం) కేంద్ర క్రీడల మంత్రి కిర‌ణ్ రిజిజు.. భార‌త అథ్లెట్ల జెర్సీల‌ను, అలాగే సహాయ సిబ్బంది యూనిఫాంలను ఆవిష్కరించారు. అథ్లెట్ల కోసం నీలం, తెలుపు రంగులలో జెర్సీలు డిజైన్‌ చేయబడగా, స‌పోర్ట్ స్టాఫ్‌ కోసం ప్రత్యేక సూట్లు రూపొందించబడ్డాయి. కాగా, షెడ్యూల్‌ ప్రకారం గతేడాది(2020) జరగాల్సిన విశ్వక్రీడలు.. ఈ ఏడాది జులైకి రీషెడ్యూల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, అంత‌క‌ముందే ఒలింపిక్స్‌​క్రీడల సంసిద్దతపై ప్రధాని మోదీ.. క్రీడల మంత్రితో సమీక్ష నిర్వహించారు. 

కరోనా నేపథ్యంలో క్రీడాకారులందరికి వ్యాక్సినేషన్, సరైన శిక్షణ, ఇతర సదుపాయాల గురించి చర్చించారు. క్రీడాకారుల‌కు సరైన ప్రోత్సాహకాలనివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని, మన దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారని అభినందించారు. విశ్వక్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల దీవెనలుంటాయని, టోక్యోకు వెళ్లే  భారత బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ కోసం మన దేశం నుంచి 11 క్రీడా విభాగాల్లో మొత్తం 100 మంది అథ్లెట్లు పాల్గొంటారు. జూన్​చివరి నాటికి ఆ సంఖ్య 125కి పెరిగే అవకాశం ఉంది. 
చదవండి: కోహ్లీతో నన్ను పోల్చకండి.. అతని స్టైల్‌ వేరు, నా స్టైల్‌ వేరు

మరిన్ని వార్తలు