‘సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి’

20 May, 2021 07:26 IST|Sakshi

ఇంగ్లండ్‌ ప్రభుత్వానికి క్రీడా శాఖ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సహా రాబోయే కొన్ని వారాల్లో ఇంగ్లండ్‌లో పలు టోర్నీల్లో పాల్గొననున్న భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు వ్యక్తిగత సమస్య ఎదురైంది. తనతోపాటు తన కుమారుడు ఇజ్‌హాన్‌కు, సహాయకురాలికి కూడా వీసా ఇవ్వాలంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని ఇంగ్లండ్‌ ప్రభుత్వం తిరస్కరించింది. క్రీడాకారిణిగా సానియాకు వీసా మంజూరు చేయగా... ప్రస్తుతం కరోనా కారణంగా భారత్‌ నుంచి వచ్చే ఇతర ప్రయాణీకుల విషయంలో ఇంగ్లండ్‌ దేశంలో ఆంక్షలు కొనసాగుతుండటమే అందుకు కారణం.

దాంతో తన సమస్యను సానియా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రెండేళ్ల కుమారుడిని వదిలి తాను ఉండటం కష్టమని ఆమె పేర్కొంది. సానియా లేఖపై స్పందించిన కేంద్రం... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఇంగ్లండ్‌ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. లండన్‌లో భారత రాయబార కార్యాలయం ఈ విషయంలో సహకరిస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు.

చదవండి: Roger Federer: ఫెడరర్‌కు భారీ షాక్‌...!

>
మరిన్ని వార్తలు