అబుదాబి: ఐపీఎల్-13లో కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ 143 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. మనీష్ పాండే (51;38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీ సాధించగా, వార్నర్(36;30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), సాహా(30 ; 31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)లు కాస్త ఫర్వాలేదనిపించారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ ఆదిలోనే జానీ బెయిర్ స్టో(5) వికెట్ను కోల్పోయింది. ప్యాట్స్ కమిన్స్ వేసిన నాల్గో ఓవర్ చివరి బంతికి బెయిర్ స్టో బౌల్డ్ అయ్యాడు. దాంతో ఎస్ఆర్హెచ్ 24 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. ఆ తరుణంలో వార్నర్కు మనీష్ పాండే జత కలిశాడు.(చదవండి:ధోని ఆట చూడకండి: అజయ్ జడేజా)
వీరిద్దరూ 35 పరుగులు జత చేసిన తర్వాత వార్నర్ సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వార్నర్ పెవిలియన్ చేరాడు. దాంతో 59 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ను కోల్పోయింది. ఆపై పాండే-సాహాల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 62 పరుగులు చేసిన తర్వాత పాండే ఔట్ కాగా, చివరి ఓవర్లో సాహా ఔటయ్యాడు. కాగా, కేకేఆర్ కట్టుదిట్టమైన బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ పరుగులు చేయడానికి అపసోపాలు పడింది. ఈ క్రమంలోనే 15 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్లు నష్టానికి 99 పరుగులు చేసింది. ఇక స్లాగ్ ఓవర్లలో పరుగులు రావడం కష్టంగా మారింది. దాంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ కోల్పోయిన వికెట్లు నాలుగే అయినా.. బోర్డుపై భారీ స్కోరును ఉంచడంలో విఫలమైంది. కేకేఆర్ బౌలర్లలో కమిన్స్, రసెల్, వరుణ్ చక్రవర్తిలు తలో వికెట్ తీశారు.(చదవండి: రైనా వైపు చూసే ప్రసక్తే లేదు: సీఎస్కే)