Sri Lanka T20 World Cup Squad: టీమిండియాపై సత్తా చాటిన వారికి అవకాశం.. స్టార్‌ ప్లేయర్స్‌కు షాక్‌

12 Sep, 2021 17:45 IST|Sakshi

కొలంబో: అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ 2021 కోసం శ్రీలంక క్రికెట్‌ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు డసున్ శనక సారథ్యం వహించనుండగా.. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ధనంజయ్ డిసిల్వా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకున్న 21 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ మహిష్ తీక్షణ తొలిసారి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జులైలో టీమిండియాపై గెలిచిన జట్టులోని మెజారిటీ సభ్యులు ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఆ సిరీస్‌లో ధవన్‌ సేనపై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన  వనిందు హసరంగ, దుష్మంత చమీరా, వికెట్‌ కీపర్‌ మినోద్‌ భానుక, ప్రవీణ్ జయవిక్రమ జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

మరోవైపు ఇంగ్లండ్‌లో కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం ద్వారా నిషేధానికి గురైన స్టార్‌ ఆటగాళ్లు నిరోషన్ డిక్వెల్లా, కుశాల్ మెండిస్, ధనుష్క గుణతిలకలకు ఈ జట్టులో చోటు దక్కపోగా, గాయం​ నుంచి కోలుకున్న కుశాల్‌ పెరీరా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, డసున్ శనక నాయకత్వంలోని లంక జట్టు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా(ధవన్‌ సేన)ను ఓడించిన విషయం తెలిసిందే. జులైలో జరిగిన ఈ సిరీస్‌ను లంక జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు మొదటగా క్యాలిఫైర్ మ్యాచ్‌లు ఆడనుంది.

శ్రీలంక టీ20 ప్రపంచకప్‌ జట్టు: డసున్ శనక (కెప్టెన్), ధనంజయ్ డిసిల్వా (వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, దినేష్ చండీమల్, అవిష్క ఫెర్నాండో, రాజపక్స, అసలంక, వనిందు హసరంగ, కె మెండిస్, కరుణరత్నే, నువాన్‌ ప్రదీప్, దుష్మంత చమీరా, జయవిక్రమ, మధుశంక, తీక్షణ.

రిజర్వ్ ప్లేయర్స్: లహిరు కుమార, బి ఫెర్నాండో, అఖిల ధనంజయ, పి తరంగ
చదవండి: అదే జరిగితే 2-2తో సిరీస్‌ సమం అవుతుంది..

మరిన్ని వార్తలు