Asia Cup 2022: పాక్‌కు షాకిచ్చిన శ్రీలంక​.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం

10 Sep, 2022 08:26 IST|Sakshi

పాక్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 టోర్నమెంట్‌లో శ్రీలంక ‘సూపర్‌–4’లో హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్‌లా శుక్రవారం జరిగిన ‘సూపర్‌–4’ ఆఖరి పోరులో శ్రీలంక 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లు సమష్టిగా పాక్‌ ఇన్నింగ్స్‌ను కూల్చారు. ఓపెనర్, కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ (29 బంతుల్లో 30; 2 ఫోర్లు), నవాజ్‌ (18 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు మాత్రమే కాస్త మెరుగనిపించారు.

ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌ (14), ఫఖర్‌ జమన్‌ (13), ఇఫ్తికార్‌ (13) తేలిగ్గానే వికెట్లను సమర్పించుకున్నారు. లంక బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హసరంగ 3 వికెట్లు పడగొట్టగా, తీక్షణ, మదుశన్‌ రెండేసి వికెట్లు తీశారు. ధనంజయ, చమికలకు చెరో వికెట్‌ దక్కింది. అనంతరం సునాయాస లక్ష్యాన్ని శ్రీలంక 17 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి గెలిచింది.

టాపార్డర్‌లో ఓపెనర్‌ కుశాల్‌ (0), గుణతిలక (0) డకౌట్‌ కావడంతో లంక 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధనంజయ డిసిల్వా (9) కూడా నిరాశపరిచాడు. ఈ దశలో మరో ఓపెనర్‌ నిసాంక (48 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) బాధ్యతగా ఆడి జట్టును గెలిపించాడు. రాజపక్స (19 బంతుల్లో 24; 2 సిక్సర్లు), కెప్టెన్‌ షనక (16 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) నిసాంకకు అండగా నిలిచారు. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం ఇక్కడే తుదిపోరు జరుగుతుంది. 
చదవండి: Asia Cup 2022: రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి భారత ఆటగాడిగా!

మరిన్ని వార్తలు