సొంతగడ్డపై విజయమే లక్ష్యంగా... 

21 Apr, 2021 10:23 IST|Sakshi

నేటి నుంచి బంగ్లాదేశ్‌తో శ్రీలంక తొలి టెస్టు

ఉదయం గం. 10:00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

పల్లెకెలె: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌ మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. జింబాబ్వే పర్యటనలో భాగంగా 2020 జనవరిలో ఆ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా టెస్టు విజయం సాధించిన శ్రీలంక... గత ఏడాది కాలంగా మరో టెస్టు గెలుపును రుచి చూడకపోవడం విశేషం. ఈ మధ్య కా లంలో మూడు టెస్టు సిరీస్‌లు ఆడిన శ్రీలంక... దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో, ఇంగ్లండ్‌ చేతిలో 0–2తో ఓడింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకుందే తప్ప విజయాన్ని మాత్రం నమోదు చేయలేకపోయింది. మరోవైపు బంగ్లాదేశ్‌ పరిస్థితి కూడా అచ్చం శ్రీలంక మాదిరిగానే ఉంది.

చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో జింబాబ్వేపైనే టెస్టు విజయాన్ని నమోదు చేసిన ఆ జట్టు మళ్లీ ఇప్పటి వరకు మరో గెలుపును నమోదు చేయలేదు. ఈ మధ్యలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో టెస్టు సిరీస్‌లు ఆడినా... వాటిని పరాజయాలతోనే ముగించింది. దాంతో తమ గెలుపు నిరీక్షణకు ఎలాగైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్న కరుణరత్నే నాయకత్వంలోని శ్రీలంక, మోమినుల్‌ హక్‌ నాయకత్వంలోని బంగ్లాదేశ్‌ బుధవారం నుంచి జరిగే టెస్టుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ రెండు జట్లు చివరిసారిగా 2017–18లో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడగా... 1–0తో శ్రీలంక విజేతగా నిలిచింది.  

చదవండి: రెడ్‌లిస్ట్‌లో పెట్టారు.. అయినా ఫైనల్‌కు నో ప్రాబ్లమ్‌! 
కోవిడ్‌ టీకాలు వేయించుకున్న కివీస్‌ క్రికెటర్లు..

మరిన్ని వార్తలు