Sri Lanka vs India: మెరిసిన దీప్తి, రేణుక

2 Jul, 2022 05:38 IST|Sakshi

పల్లెకెలె: శ్రీలంక జట్టుతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును ఓడించింది. రేణుక సింగ్‌ (3/29) పదునైన బౌలింగ్‌... దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (3/25; 22 నాటౌట్‌) భారత విజయంలో కీలకపాత్ర పోషించాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక 48.2 ఓవర్లలో171 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షి డిసిల్వా (43; 4 ఫోర్లు), హాసిని పెరీరా (37; 5 ఫోర్లు) రాణించారు.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 38 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (35; 1 ఫోర్, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (44; 3 ఫోర్లు), హర్లీన్‌ (34; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. పూజా వస్త్రకర్‌ (21 నాటౌట్‌; 2 సిక్స్‌లు)తో కలిసి దీప్తి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. శ్రీలంక బౌలర్లలో ఇనోకా రణవీర (4/39), ఒషాది రణసింఘే (2/34) టీమిండియాను ఇబ్బంది పెట్టినా ఇతర బౌలర్లు విఫలమయ్యారు. రెండో వన్డే ఇదే వేదికపై సోమవారం జరుగుతుంది.

మరిన్ని వార్తలు