T20 World Cup 2022: ఇవాళ మరోసారి భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌

24 Oct, 2022 17:03 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 అఫీషియల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ క్రికెట్‌ లవర్స్‌కు దీపావళి కానుక ఇవ్వనుంది. భారత-పాక్‌ జట్ల మధ్య నిన్న జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ ఇవాళ (అక్టోబర్‌ 24) మరోసారి ప్రసారం చేయనుంది. రాత్రి  8 గంటలకు స్టార్‌ స్పోర్ట్స్‌ 1, స్టార్‌ స్పోర్ట్స్‌ 1HD, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 Hindi, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 HD Hindi ఛానల్స్‌లో ఫుల్‌ మ్యాచ్‌ను బాల్‌ టు బాల్‌ రీ టెలికాస్ట్‌ చేయనున్నట్లు స్టార్‌ స్పోర్ట్స్‌ యాజమాన్యం ప్రకటించింది. స్టార్‌ స్పోర్ట్స్‌ చేసిన ఈ ప్రకటనతో క్రికెట్‌ ప్రేమికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్టార్‌ స్పోర్ట్స్‌ మాకు నిజమైన దీపావళి కానుక ఇచ్చిందని సంబురపడిపోతున్నారు. కోహ్లి బాంబ్‌ మరోసారి పేలితే చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామని అంటున్నారు. 

ఇదిలా ఉంటే, నిన్న జరిగిన దాయాదలు సమరాన్ని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రత్యక్షంగా లక్ష మంది వరకు వీక్షించారు. డిజిటల్‌ ప్లాట్‌ఫాం వేదికపై అయితే నిన్నటి మ్యాచ్‌ గత రికార్డులన్నిటినీ తిరగరాసింది. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను ఏకంగా కోటి 80 లక్షల మంది వీక్షించారు. ఇవాళ మ్యాచ్‌ మరోసారి టెలికాస్ట్‌ అయితే భారీ సంఖ్యలో వ్యూస్‌ వస్తాయని స్టార్‌ స్పోర్ట్స్‌ అంచనా వేస్తుంది. కోహ్లి పటాకా ఇన్నింగ్స్‌ బాల్‌ టు బాల్‌ చూసేందుకు క్రికెట్‌ ప్రేమికులు ఎగబడతారని భావిస్తుంది. 

కాగా,  చిరకాల ప్రత్యర్ధుల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి (53 బంతుల్లో 82 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచితంగా పోరాడి టీమిండియాకు అపురూప విజయాన్నందించాడు. కోహ్లి పోరాటానికి హార్ధిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (40, 3/30) కూడా తోడవ్వడంతో టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది.  
చదవండి: IND VS PAK: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా

మరిన్ని వార్తలు