కమిన్స్‌ నాపై సులభంగా గెలిచాడు : స్మిత్‌

1 Oct, 2020 16:04 IST|Sakshi

దుబాయ్‌ : క్రికెట్‌లో ఒక జట్టులో ఉండే ఆటగాళ్లు ప్రత్యర్థులుగా కనబడితే ఆ మజా వేరుగా ఉంటుంది. అది అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సాధ్యం కాదు గాని.. ఐపీఎల్‌ లాంటి లీగ్‌లో మాత్రం ఇలాంటివి చూస్తూనే ఉంటాం. మన టీమిండియా జట్టుగా ఉన్నప్పుడు అందరిని ఒకే దృష్టితో చూసే మనం ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం ఎవరికి వారు తమకు నచ్చిన ఆటగాడిని ఇష్టపడుతూ మిగతావారిని ప్రత్యర్థులుగానే చూస్తాం.  ఈ విధంగా చూస్తే ఐపీఎల్‌ సీజన్‌ మొదలైనప్పటి నుంచి ఇలాంటివి ఎన్నో చూశాం. ఉదాహరణకు బుమ్రా కోహ్లికి బౌలింగ్‌ చేయడం.. అశ్విన్‌ క్యారమ్‌ బాల్స్‌తో రోహిత్‌ను కట్టడి చేయడం.. వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇది ఒక్క భారత ఆటగాళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. (చదవండి : నిబంధన ఉల్లంఘించిన రాబిన్‌ ఊతప్ప)

ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్‌ కమిన్స్‌, స్టీవ్‌ స్మిత్‌లు కొన్నేళ్లుగా ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఇప్పుడు కేకేఆర్‌, రాజస్తాన్‌కు ఆడుతున్నారు. తాజాగా బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ లక్ష్య చేధనలో తడబడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో  కమిన్స్‌ తాను వేసిన తొలి ఓవర్‌లోనే స్టీవ్‌ స్మిత్‌ను అవుట్‌ చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పాట్‌ కమిన్స్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.

'మ్యాచ్‌లో కమిన్స్‌తో జరిగిన యుద్ధంలో అతను నాపై చాలా సులభంగా గెలిచాడు. నా ఔట్‌పై ఇంతకముందే కమిన్స్‌తో మాట్లాడా.. ప్రాక్టీస్‌లో అన్ని మంచి బంతులే ఉండొచ్చు.. కానీ అందులో నిన్ను అవుట్‌ చేసే బంతి కూడా ఒకటి ఉంటుందని తెలిపాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ప్రతీ మ్యాచ్‌ గెలవాలని లేదు కదా.. ఇలా ఎదురుదెబ్బలు తిన్నప్పుడే.. మా లోపాలు ఏంటనేవి బయటపడుతాయి. మా బ్యాటింగ్‌లో కొన్ని చోట్ల ఇంప్రూవ్‌మెంట్‌ జరగాల్సి ఉంది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఏంచుకొని కేకేఆర్‌ను మా బౌలింగ్‌తో కట్టడి చేద్దామని అనుకున్నాం.. అప్పటికీ మా బౌలర్లు దానిలో కొంచెం సఫలీకృతంగానే కనిపించారు. కానీ చేధనలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఓడిపోవాల్సి వచ్చింది.

మాలో కొంతమంది ఇప్పటికీ మేము షార్జాలో ఆడుతున్నామని అనుకున్నాము. కానీ దుబాయ్‌లో మైదానం ఇరువైపులా ఒకేలా లేదు. ఒకవైపై బౌండరీ కాస్త దూరంగా.. మరోవైపు కొంచెం దగ్గరగా అనిపించాయి. మ్యాచ్‌లో కీలక క్యాచ్‌లను విడవడం కూడా మా ఆటతీరుపై ప్రభావం చూపిందంటూ ' తెలిపాడు. కాగా రాజస్తాన్‌ రాయల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ అక్టోబర్‌ 3న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది. (చదవండి : ఐపీఎల్‌ తర్వాత ధోని చేసేదేంటో తెలుసా?)

>
మరిన్ని వార్తలు