ఈ మ్యాచ్‌లో నా ఫోకస్‌ మొత్తం అశ్విన్‌పైనే..

7 Jan, 2021 18:02 IST|Sakshi

సిడ్నీ : ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ టీమిండియా బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన ఫోకస్‌ మొత్తం అశ్విన్‌పైనే ఉంటుందని స్మిత్‌ తెలిపాడు. మూడో టెస్టులో భాగంగా తొలిరోజు ఆట ముగిసిన అనంతరం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా స్మిత్‌ మీడియాతో మాట్లాడాడు. 

మొదటి రెండు టెస్టుల్లో నా నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. కానీ మూడో టెస్టు మ్యాచ్‌కు వచ్చేసరికి నా బ్యాటింగ్‌లో కొంత మార్పు కనిపించింది. మొదటిరోజు ఆటలో చివరి సెషన్‌ వరకు నిలిచి లబుషేన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడం సంతృప్తినిచ్చింది. అయితే ఈ సిరీస్‌లో అశ్విన్‌పై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాను.. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం అశ్విన్‌ను ఒత్తిడిలో పడేసే దానిపైనే ప్రత్యేక దృష్టి సారించాను. ఆరంభంలో బంతులను ఎదుర్కోవడంలో కాస్త తడబడ్డా పిచ్ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చాక బౌండరీలతో పరుగుల రాబట్టడంలో సక్సెస్‌ అయ్యాను. ఇదే టెంపోనూ రెండో రోజు ఆటలోనూ కొనసాగించాలని అనుకుంటున్నా. ఇప్పటికైతే రెండు సెషన్లు కలుపుకొని మేమే పైచేయి సాధించామని పేర్కొన్నాడు. (చదవండి: ఆయన కల నెరవేరింది.. కానీ ఈరోజు బతికిలేరు)

కాగా వన్డే సిరీస్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న స్మిత్‌ మొదటి రెండు టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టులు కలిపి 10 పరుగులు చేసిన స్మిత్‌ రెండుసార్లు అశ్విన్‌ బౌలింగ్‌లోనే ఔట్‌ కావడం విశేషం.ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్ 67 పరుగులతో‌, స్టీవ్‌ స్మిత్ 31 పరుగులతో‌ క్రీజులో ఉన్నారు. కాగా మొదటి సెషన్‌లో ఆసీస్‌ 7 పరుగులు చేసిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో ఒక సెషన్‌ మొత్తం తూడిచిపెట్టుకుపోయింది. (చదవండి: 'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది')

మరిన్ని వార్తలు