'టీమిండియాపై స్లెడ్జింగ్‌ ఈసారి కష్టమే'

6 Nov, 2020 17:58 IST|Sakshi

సిడ్నీ : ఆసీస్‌ అంటేనే స్లెడ్జింగ్‌కు మారుపేరు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గతంలోనూ చాలా సార్లు ఆసీస్‌ ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు పాల్పడి మానసికంగా వారిపై విజయం సాధించేవారు. 2000వ సంవత్సరం నుంచి 2012 వరకు ఆసీస్‌ తిరుగులేని జట్టుగా ఉన్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లపై కవ్వింపు చర్యలకు పాల్పడి సగం విజయాలు సాధించేవారు. ఆండ్రూ సైమండ్స్‌- హర్బజన్‌ మంకీగేట్‌ వివాదం ఇలాంటి కోవకు చెందినదే. గత దశాబ్ద కాలంలో ఆసీస్‌ ఆటగాళ్లలో స్లెడ్జింగ్‌ విపరీతంగా ఉన్నా ఈ మధ్యన కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. (చదవండి : అందుకే ముంబై అలా చెలరేగిపోతోంది)

ఐపీఎల్‌ 13వ సీజన్‌ ముగిసిన తర్వాత టీమిండియా సుధీర్ఘ పర్యటనలో భాగంగా ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆసీస్‌ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. కాగా నవంబర్‌ 27 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆసీస్‌ మాజీ ఆటగాడు స్టీవ్‌ వా స్లెడ్జింగ్‌ అంశాన్ని మరోసారి ప్రస్థావనకు తెచ్చాడు.  ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టీవా పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.

'ఈసారి కోహ్లి సేనపై స్లెడ్జింగ్‌ కాస్త కష్టమే అని చెప్పొచ్చు. భారత ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌ పనిచేయకపోవచ్చు. ఎందుకంటే టీమిండియా కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. అలాంటి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు దిగితే వారికి బూస్ట్‌నిచ్చి సిరీస్‌లో మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆసీస్‌ ఆటగాళ్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. టీమిండియాను వదిలేయండి.. వారి ఆటను ఆడనివ్వండి..దయచేసి ఎవరు స్లెడ్జింగ్‌కు పాల్పడొద్దు. ఇక కోహ్లి విషయానికి వస్తే ఆసీస్‌ సిరీస్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

ఇప్పటికే వరల్డ్‌ కాస్‌ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లి నిజానికి ఆసీస్‌ పర్యటనపై కసితో ఉన్నాడు. 2018-19 ఇండియా పర్యటనలో స్మిత్‌.. కోహ్లిలు ఒకరినొకరు పోటీపడగా.. అందులో స్మిత్‌ పైచేయి సాధించాడు. ఆ సిరీస్‌లో స్మిత్‌ మూడు సెంచరీలు చేయగా.. కోహ్లి పెద్దగా రాణించలేకపోయాడు. నెంబర్‌వన్‌ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కోహ్లి ఆ పేరును నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు.అని స్టీవా తెలిపాడు. కాగా 2018-19 బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపిని టీమిండియా నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు