వార్నర్‌ రిటైరైన తర్వాత బుక్‌ రాస్తాడని భావిస్తున్నా: బ్రాడ్‌

18 May, 2021 14:42 IST|Sakshi

లండన్‌: 2018లో ఆసీస్‌ క్రికెటర్ల బాల్‌ టాంపరింగ్‌ వివాదం అందరూ మరిచిపోతున్నారన్న దశలో దానిలో భాగస్వామిగా ఉన్న క్రికెటర్‌ కామెరున్‌ బ్యాన్‌క్రాఫ్ట్‌.. బాల్‌ టాంపరింగ్‌ విషయం మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వివాదం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. బ్యాన్‌క్రాఫ్ట్‌ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న సీఏ మరోమారు విచారణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''బ్యాన్‌క్రాఫ్ట్‌ వ్యాఖ్యలతో బాల్‌ టాంపరింగ్‌ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. నేను ఆస్ట్రేలియాకు బౌలింగ్‌ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇంగ్లండ్‌ తరపున బౌలింగ్‌ చేసేటప్పుడు ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయె చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ బౌలింగ్‌ సమయంలో నీ సీమ్‌లో తేడా ఉంటే అండర్సన్‌ సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. బాల్‌ టాంపరింగ్‌ జరిగిన రోజు  ఆసీస్‌ జట్టులో ఇది కనిపించలేదు. బంతిని రివర్స్‌సింగ్‌  రాబట్టడం కోసం బ్యాన్‌క్రాఫ్ట్‌ ఆ పని చేసి ఉండొచ్చు. కానీ టెస్టుల్లో ఉపయోగించే ఎర్రబంతి పాతబడ్డాక స్వింగ్‌ రాబట్టడం కొంచెం కష్టమే. కానీ దానికి కొన్ని టెక్నిక్స్‌ ఉన్నాయి. వాటిని ఆసీస్‌ ఉపయోగించుకోలేదు. ఇక బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంపై డేవిడ్‌ వార్నర్‌ ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత బుక్‌ రాస్తాడని భావిస్తున్నా. ఈ విషయం నాకు వార్నర్‌కి దగ్గరగా ఉండే వ్యక్తి ద్వారా తెలిసింది'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్‌ సిరీస్‌ నవంబర్‌,డిసెంబర్‌లో జరగనుంది. దీనికి ముందు ఇంగ్లండ్‌ జట్టు కివీస్‌, భారత్‌తో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. మరోవైపు ఆస్రేలియా విండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడనుంది.  కాగా బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం క్రికెట్‌లో పెను దుమారం రేపింది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్‌ బంతికి స్యాండ్‌ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది.
చదవండి: Ball Tampering: మళ్లీ తెరపైకి ‘ట్యాంపరింగ్‌’

బాల్‌ ట్యాంపరింగ్‌ చేస్తున్నానని వారికీ తెలుసు: బ్యాన్‌క్రాఫ్ట్‌

మరిన్ని వార్తలు