పోరాడి గెలిచిన సన్‌రైజర్స్‌

2 Oct, 2020 23:38 IST|Sakshi

దుబాయ్‌: సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోరాడి గెలిచింది. సన్‌రైజర్స్‌ 164 పరుగుల స్కోరును కాపాడుకుని మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. సీఎస్‌కేపై 7 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ గెలిచి మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌లో సీఎస్‌కేకు శుభారంభం లభించలేదు. వాట్సన్‌(1) విఫలం కాగా, ఆపై అంబటి రాయుడు(8), డుప్లెసిస్‌(22), కేదార్‌ జాదవ్‌(3)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. దాంతో  సీఎస్‌కే 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

అటు తర్వాత ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజాలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. జడేజా 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించగా, ధోని 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. సామ్‌ కరాన్‌ 5 బంతుల్లో 2 సిక్స్‌లతో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరకూ ఆసక్తిరేపిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఐదు వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నటరాజన్‌ రెండో వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌, అబ్దుల్‌ సామద్‌లు తలో వికెట్‌ సాధించారు.(చదవండి: బౌండరీ లైన్‌పై ఇదేమి ‘మాయ’ డుప్లెసిస్‌)

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. జానీ బెయిర్‌స్టో పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. దాంతో క్రీజ్‌లోకి వచ్చిన మనీష్‌ పాండే బ్యాట్‌కు పనిచెప్పాడు. కాకపోతే మంచి టచ్‌లో ఉన్న సమయంలో మనీష్‌ పాండే(29; 21 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో సామ్‌ కరాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దాంతో 47 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది.మరో 22 పరుగుల వ్యవధిలో డేవిడ్‌ వార్నర్‌(28; 29 బంతుల్లో 3 ఫోర్లు)ను డుప్లెసిస్‌ అద్భుతమైన క్యాచ్‌తో ఔట్‌ చేయగా, ఆపై వెంటనే కేన్‌ విలియమ్సన్‌ రనౌట్‌గా ఔటయ్యాడు. దాంతో 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆరెంజ్‌ ఆర్మీ.  

ఆ సమమయంలో యువ ఆటగాళ్లు ప్రియం గర్గ్‌-అభిషేక్‌లు దుమ్ములేపారు. సీఎస్‌కే బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 76 పరుగులు జత చేశారు. అభిషేక్‌(31; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై  ప్రియం గర్గ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కడవరకూ క్రీజ్‌లో ఉన్న ప్రియం గర్గ్‌ 26 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌తో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అబ్దుల్‌ సామద్‌ 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు సాధించగా, శార్దూల్‌ ఠాకూర్‌, పీయూష్‌ చావ్లాలు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు