‘సన్నీ 50’కి ఘనమైన సత్కారం

7 Mar, 2021 05:37 IST|Sakshi

అహ్మదాబాద్‌: భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో జేగంట మోగించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆయనను ఘనంగా సన్మానించింది. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఆఖరి టెస్టు మూడో రోజు భోజన విరామంలో గావస్కర్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన బోర్డు... సన్నీ సేవల్ని కొనియాడింది. తన 16 ఏళ్ల కెరీర్‌లో గావస్కర్‌ 125 టెస్టులు, 108 వన్డేలు ఆడారు. 1987 మార్చి 7న అహ్మదాబాద్‌ స్టేడియంలోనే గావస్కర్‌ టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందారు. 71 ఏళ్ల సన్నీ సరిగ్గా అర్ధ శతాబ్దం క్రితం 1971లో జరిగిన వెస్టిండీస్‌ పర్యటనలో మార్చి 6న అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ శతకాలు బాదిన తర్వాత 1987దాకా 16 ఏళ్లపాటు భారత క్రికెట్‌కు ఎన లేని సేవలందించి... దిగ్గజంగా ఎదిగారు.

మరిన్ని వార్తలు