Virat Kohli: 'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే'

17 Dec, 2021 07:54 IST|Sakshi

Sunil Gavaskar Comments About Kohli Rifts With BCCI.. కోహ్లి వివాదాన్ని ముగించేందుకు సరైన వ్యక్తి గంగూలీ మాత్రమేనని మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ‘నాకు తెలిసి కోహ్లి బీసీసీఐని ఉద్దేశించి కాకుండా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యలు చేశాడు. తాను కోహ్లితో మాట్లాడాడా లేదా అనేది సౌరవ్‌ మాత్రమే చెప్పగలడు. ఒకే విషయంపై రెండు వేర్వేరు వ్యాఖ్యలు ఎలా వచ్చాయన్నది అతనికే తెలియాలి’ అని గావస్కర్‌ అన్నాడు.

చదవండి: విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు

అయినా తనను కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు చీఫ్‌ సెలక్టర్‌ చెప్పడంతో కోహ్లి ఇబ్బంది పడాల్సిందేమీ లేదని, ఎవరి ద్వారానో తెలిసే బదులు సరైన రీతిలోనే అతనికి సమాచారం లభించిందని సన్నీ చెప్పాడు. బోర్డు అధ్యక్షుడు, కెప్టెన్‌ మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఇది సరైన సమయం కాదని...కీలక పర్యటనకు ముందు ఇలాంటిది మంచిది కాదని మరో మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అన్నాడు. ఎవరు సరైనవాడో, ఎవరిది తప్పో మున్ముందు తేలుతుందని, ప్రస్తుతానికి అన్నీ పక్కన పెట్టి ఆటపై దృష్టి పెట్టాలని అతను సూచించాడు.  

‘మేం చూసుకుంటాం’
న్యూఢిల్లీ: వన్డే కెప్టెన్సీనుంచి తనను తొలగించడం, టి20 కెప్టెన్సీనుంచి తాను తప్పుకున్న క్రమంలో జరిగిన ఘటనల గురించి విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించేందుకు నిరాకరించాడు. ఏకవాక్యంలో అతను తన స్పందన తెలియజేశాడు ‘ప్రస్తుతం దీ నిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. ఎలాంటి మీడియా సమావేశం కూడా నిర్వహించం. ఈ అంశాన్ని బీసీసీఐకి వదిలేయండి. అన్నీ మేం చూసుకుంటాం’ అని గంగూలీ స్పష్టం చేశాడు. తాజా పరిణామాలపై బోర్డు ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. కీలకమైన దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు బోర్డు స్పందిస్తే అది ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మౌనం వహించడమే ఉత్తమమనే ఆలోచనతో బీసీసీఐ ఉంది.  

చదవండి: Virat Kohli-Sourav Ganguly: కోహ్లిపై మాట దాటేసిన దాదా.. కారణం అదేనా?

మరిన్ని వార్తలు