'ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి'

10 Feb, 2021 10:44 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా తుది జట్టులో లెగ్‌స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని కోరాడు. ఫిబ్రవరి 13 నుంచి మొదలుకానున్న రెండో టెస్టులో షాబాజ్‌ నదీమ్‌ లేదా సుందర్‌లలో ఒకరిని తప్పించి కుల్దీప్‌కు చాన్స్‌ ఇవ్వాలని కోరాడు. 'అశ్విన్‌, సుందర్‌లు ఇద్దరు ఆఫ్‌ స్పిన్నర్లే.. అయితే బౌలింగ్‌లో ఎవరి శైలి వారిది. అయితే ఇప్పటికిప్పుడు సుందర్‌ను తీసేయాలనేది కరెక్ట్‌ కాదు. ఎందుకంటే బ్రిస్బేన్‌ టెస్టులో బ్యాటింగ్‌లో అదరగొట్టిన సుందర్‌ అదే టెంపోను చెన్నైలోనూ కొనసాగించాడు. 85 నాటౌట్‌ ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్‌ పరంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

జడేజా జట్టులోకి వచ్చేంతవరకు సుందర్‌ను తీసే అవకాశం లేదు. దీంతో కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోవాలంటే షాబాజ్‌ నదీమ్‌ను పక్కన పెట్టాల్సిందే. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో నదీమ్‌ కొంచెం ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించాడు. అతను బౌలింగ్ చేసే విధానం, నో బాల్స్ వేసే తీరు చూస్తే అతను కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించింది. కుల్దీప్‌ ఇప్పటికే చెన్నై వేదికగా మ్యాచ్‌ ఆడాడు కాబట్టి పిచ్‌ పరిస్థితి అతనికి సులువుగా అర్థం అవుతుంది. పైగా లెగ్‌ స్పిన్‌, ఆఫ్‌ స్పిన్‌ కాంబినేషన్‌ ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందంటూ' చెప్పుకొచ్చాడు. కుల్దీప్‌ టీమిండియా తరపున 6 టెస్టుల్లో 24 వికెట్లు, 61 వన్డేల్లో 105 వికెట్లు, 21 టీ20ల్లో 39 వికెట్లు తీశాడు. కాగా తొలిటెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. 
చదవండి: 5–3–6–3.. వాటే స్పెల్‌ అండర్సన్‌
ధోని తరహాలో జడ్డూ పోస్ట్‌.. ఫ్యాన్స్‌లో ఆందోళన

మరిన్ని వార్తలు