ILT20 23: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కీలక నిర్ణయం..! అబుదాబి కెప్టెన్‌గా సునీల్ నరైన్

15 Dec, 2022 12:37 IST|Sakshi

యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌ తొలి సీజన్ వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ లీగ్‌లో  అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వెస్టిండీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ సునీల్ నరైన్ నియమితుడయ్యాడు. కాగా అబుదాబి నైట్ రైడర్స్ ప్రాంఛైజీని ఐపీఎల్‌ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

గత కొన్ని ఐపీఎల్‌ సీజన్‌ల నుంచి సునీల్‌ నరైన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి అబుదాబి జట్టు పగ్గాలు కేకేఆర్‌ యాజమాన్యం అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇక టీ20 క్రికెట్‌లో సునీల్‌ నరైన్‌ అద్భుతమైన ఆటగాడు.

అతడికి 400 పైగా టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. కాగా అబుదాబి నైట్ రైడర్స్ జట్టులో నరైన్‌తో పాటు  ఆండ్రీ రస్సెల్‌, రవి రాంపాల్, అకేల్ హొస్సేన్, రేమాన్ రీఫర్, కెన్నార్ లూయిస్‌ వంటి విండీస్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇక కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం సునీల్‌ నరైన్‌ స్పందించాడు.

"అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్దంగా ఉన్నాను. ఇది ఒక కొత్త సవాలు. ఎందుకంటే ఇప్పడు నేను నా బ్యాటింగ్‌, బౌలింగ్‌పై కాకుండా జట్టు మొత్తం ఆటతీరుపై దృష్టిపెట్టాలి. నాకు నైట్‌ రైడర్స్‌ గ్రూపుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

చాలా ప్రాంఛైజీలో లీగ్‌ల్లో నైట్‌ రైడర్స్‌కు సంబంధించిన జట్లు ఉన్నాయి. ప్రతీ చోటా వాళ్ల జట్టులో నేను భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇక యూఏఈలో నేను చాలా క్రికెట్‌ ఆడాను. అక్కడి పరిస్థితులు బాగా తెలుసు. కాబట్టి జట్టును విజయ పథంలో నడిపించడానికి ప్రయత్నిస్తాను అని సునీల్‌ నరైన్‌ పేర్కొన్నాడు.
చదవండి: IND Vs BAN: పాపం శ్రేయస్‌ అయ్యర్‌.. తృటిలో సెంచరీ మిస్‌!


 

మరిన్ని వార్తలు