Rajinikanth: అభిమానం స్టేడియానికి రప్పించిన వేళ..

17 Mar, 2023 15:48 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ముంబైలోని వాంఖడే వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేకు హాజరయ్యారు. స్వతహగా క్రికెట్‌ అభిమాని అయిన రజనీని గతంలో చాలా మంది క్రికెటర్లు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇటీవలే టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ చెన్నైలో రజినీకాంత్‌ని ప్రత్యేకంగా కలిశాడు. గతంలో ధోనీ కూడా సూపర్ స్టార్‌ని కలిసి చాలా సేపు ముచ్చటించాడు.

ఇక క్రికెట్‌పై ఆయనకున్న అభిమానం ఇవాళ వాంఖడే స్టేడియానికి రప్పించిందని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అమోల్‌ ఖేల్‌ పేర్కొన్నాడు. ''వాంఖడే స్టేడియానికి వచ్చి తొలి వన్డే మ్యాచ్ చూడాలని లెజెండరీ యాక్టర్ రజినీకాంత్‌ని ఆహ్వానించా. ఆయన నా ఆహ్వానాన్ని మన్నించారు. చాలా రోజుల తర్వాత వాంఖడేలో సూపర్ స్టార్ అడుగుపెట్టారు'' అని అమోల్ ఖేల్ చెప్పుకొచ్చారు. స్టేడియంలోని బిగ్‌ స్క్రీన్స్‌పై రజినీకాంత్ కనిపించగానే స్టేడియం కేరింతలతో హోరెత్తిపోయింది. వీఐపీ గ్యాలరీలో కూర్చుని రజనీకాంత్ మ్యాచ్‌ని వీక్షిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచింది. రోహిత్‌ శర్మ మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో జట్టు తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

చదవండి: భారత్‌, ఆసీస్‌ తొలి వన్డే.. రణరంగంగా ఆజాద్‌ మైదాన్‌

సచిన్‌ రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లితో రోహిత్‌ పోటాపోటీ!

మరిన్ని వార్తలు