గంగూలీ, జై షా పదవుల్లో కొనసాగుతారా? వారంలో వీడనున్న ఉత్కంఠ

15 Jul, 2022 19:40 IST|Sakshi

బీసీసీఐ రాజ్యాంగ సవరణపై వేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జై షాల కొనసాగింపుపై వచ్చే వారంలోగా స్పష్టత రానుంది. వచ్చే వారం పిటిషన్‌ను పరిశీలించి విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్‌ గంగూలీ 2019 అక్టోబరులో బాధ్యతలు చేపట్టాడు. అటు జై షా కూడా దాదాపు అదే సమయంలో బీసీసీఐ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాడు. ఈ ఇద్దరి పదవి కాలం జూలై 2020లోనే ముగిసింది.

జస్టిస్‌ ఆర్ఎం లోథా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ లేదా రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్‌లో గరిష్టంగా ఆరేళ్లకు మించి పనిచేయకూడదు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే మధ్యలో మూడేళ్ల విరామం తప్పనిసరి అనే నిబంధన ఉంది. గంగూలీ, జై షాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్‌లో సుధీర్ఘ కాలం పనిచేశారు. గంగూలీ బెంగాల్‌ క్రికెట్‌​ అసోసిచేషన్‌.. జై షా గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో విధులు నిర్వర్తించారు. నిబంధనల ప్రకారం చూస్తే గంగూలీ, జై షాలు ఎప్పుడో ఆ పదవి నుంచి దిగిపోవాలి. అయితూ డిసెంబర్‌ 2019లో జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో మూడేళ్ల విరామం నిబంధనను తొలగిస్తూ ప్రతిపాదనను తీసుకొచ్చింది.

బీసీసీఐ తెచ్చిన ప్రతిపాదన ప్రకారం గంగూలీ, జై షాలు తమ పదవుల్లో కొనసాగుతూ వస్తున్నారు. అయితే బీసీసీఐ తాము తీసుకొచ్చిన కొత్త​ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతి కోరుతూ 2020 ఏప్రిల్‌లో  పిటిషన్‌ దాఖలు చేసింది. కరోనా కారణంగా అప్పటి నుంచి ఈ అంశం విచారణకు రాలేదు. దీంతో అత్యవసర విచారణ ఏర్పాటు చేయాలంటూ బీసీసీఐ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కోర్టు అందుకు అంగీకరించింది.

చదవండి: ENG vs PAK: పాక్‌పై నమ్మకం లేదు.. అందుకే ఇలా: ఈసీబీ

Sachin Tendulkar: అపూర్వ కలయిక.. దిగ్గజ క్రికెటర్‌తో మరో దిగ్గజం

మరిన్ని వార్తలు