IPL 2022: "సురేశ్ రైనా.. నా జీవితంలోకి దేవుడిలా వచ్చాడు.. అత‌డి వ‌ల్లే ఇదంతా"

21 Apr, 2022 18:30 IST|Sakshi
PC: IPL.com

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యువ పేస‌ర్ కార్తీక్ త్యాగి త‌న కెరీర్‌కు సురేష్ రైనా మ‌ద్ద‌తుగా నిలిచడాని తెలిపాడు. 2020 అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో అద‌ర‌గొట్టిన కార్తీక్ త్యాగి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌-2020 వేలంలో త్యాగిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అత‌డు ఆ సీజ‌న్‌లో 9 వికెట్లు ప‌డ‌గొట్టి అంద‌ర‌నీ అక‌ట్టుకున్నాడు. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో కార్తీక్ త్యాగిని  రూ. 4 కోట్లకు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది.

"నేను ఎప్పుడూ చెప్పేది ఒక‌టే. అండ‌ర్‌-16కు ఆడుతున్న‌ప్పుడు సురేష్ రైనా నా జీవితంలోకి దేవుడిలా వ‌చ్చాడు. ఎందుకంటే రైనా వల్లే నేను ఈ రోజు ఈ స్ధాయిలో ఉన్నాను. నాకు 13 ఏళ్లు ఉన్న‌ప్ప‌డు.. నేను అండ‌ర్‌-14 ట్రయల్స్‌లో పాల్గొన్నాను. అక్క‌డ నుంచే నా క్రికెట్ ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. త‌రువాత నేను అండ‌ర్‌-14 జ‌ట్టుకు ఆడటం ప్రారంభించాను.. ఆపై అండర్-16కు ఆడాను. రంజీ ట్రోఫీలోకి వచ్చినప్పుడు నేను 16 ఏళ్ల యువకుడిని. మిగితా వాళ్లంద‌రూ అప్ప‌టికే సీనియ‌ర్లుగా జ‌ట్టులొ ఉన్నారు.

సురేష్ రైనా రోజూ ప్రాక్టీస్‌కు వ‌చ్చే వాడు. నేను అక్క‌డే ఉండి అన్నీ గమనిస్తూ ఉండేవాడిని.  ఒక రోజు అత‌డు  ప్రాక్టీస్ ముగించుకుని బయలుదేరాడు. కానీ అతను తిరిగి గ్రౌండ్‌కి ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నీ రోల్ ఏంటి అని అడిగాడు. నేను బౌల‌ర్‌ను అని బదులు చేప్పాను. ఆపై రైనా నాకు నెట్స్‌లో బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు.

అత‌డు నా ప్ర‌ద‌ర్శ‌న చూసి.. "నీ బౌలింగ్ నాకు న‌చ్చింది. భవిష్యత్తులో నీకు అవకాశాలు వచ్చేలా చూస్తానని" చెప్పాడు. సురేష్ రైనా లాంటి అత్య‌త్తుమ ఆట‌గాడు మెచ్చు కోవడం న‌న్ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ తర్వాత రంజీ ట్రోపీ ఆడే యూపీ జట్టుకు నేను ఎంపిక‌య్యాను. రైనా వ‌ల్లే నా రంజీ కెరీర్ మొదలైంది అని కార్తీక్ త్యాగి పేర్కొన్నాడు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న త్యాగి..ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు.

 చ‌ద‌వండి: IPL 2022: చెన్నై, ముంబై పోరు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను తలపిస్తుంది.. భజ్జీ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు