హగ్‌ చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చా : రైనా

17 Aug, 2020 17:11 IST|Sakshi

క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురిచేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ, వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్టు 15న ఇద్దరూ తమ రిటైర్మెంట్లను ప్రకటించారు. ధోనీ ప్రకటన చేసిన వెంటనే రైనా కూడా వీడ్కోలు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని తెలిసే దానికనుగుణంగానే ఆటకు వీడ్కోలు పలికేందుకు తాను సిద్దమయ్యాయని రైనా వెల్లడించాడు. రిటైర్మెంట్‌ ప్రకటన అనంతరం ఇద్దరం అప్యాయంగా కౌగిలించుకున్నామని, కన్నీళ్లు కూడా పెట్టుకున్నామని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా చెప్పాడు. (చదవండి : ధోని రికార్డును ఏ కెప్టెన్‌ బ్రేక్‌ చేయలేరు)

'చెన్నై చేరుకోగానే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నాకు తెలుసు. దీంతో నేను కూడా సిద్దమయ్యా. నేను, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, కరణ్ శర్మ చార్టెడ్ ప్లేన్‌లో రాంచీ చేరుకున్నాం. అక్కడ ధోని, మోనూ సింగ్‌ను పిక్ చేసుకున్నాం. మా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇద్దరం ఆప్యాయంగా కౌగిలించుకున్నాం. వెక్కివెక్కి ఏడ్చాం. అనంతరం నేను, పియూష్, రాయుడు, కేదార్ జాదవ్, కరన్ అంతా కూర్చొని మా కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి రాత్రంతా మాట్లాడుకున్నామ'ని రైనా చెప్పుకొచ్చాడు. (చదవండి : ఇక ధోని ఎక్కువ సమయం దానికే కేటాయిస్తాడు)

అలాగే ఆగస్ట్‌ 15వ తేదినే ఎందుకు ఆటకు వీడ్కోలు పలికారో కూడా రైనా వివరించారు. ధోనీ జెర్సీ నంబర్ 7 అని, తన జెర్సీ నంబర్ 3 అని రెండూ కలిపితే 73 వస్తుందన్నాడు. అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో 73 ఏళ్లు పూర్తయ్యాయని.. అందుకే తాము అదే రోజు వీడ్కోలు ప్రకటన చేశానని రైనా వివరించాడు.

మరిన్ని వార్తలు