శ్రేయస్‌ అయ్యర్‌ సర్జరీ సక్సెస్‌.. త్వరలో తిరిగి మైదానంలోకి 

8 Apr, 2021 21:52 IST|Sakshi

న్యూఢిల్లీ: మార్చి 23న పుణే వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో గాయపడ్డ టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రేయస్ అయ్యర్‌ ఇవాళ సర్జరీ చేయించుకున్నాడు. భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం అయ్యిందని, త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతానని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘సర్జరీ సక్సెస్‌.. ధృడసంకల్పంతో అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తాను. మీ అందరి విషెస్‌కు కృతజ్ఞతలు’ అంటూ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నాడు. సర్జరీ అనంతరం హాస్పిటల్‌ బెడ్‌పై దిగిన ఫొటోను ఆయన షేర్‌ చేశాడు. శ్రేయస్‌ కోలుకోవడానికి కనీసం నాలుగు నెలలు పడుతుందని డాక్టర్లు తెలిపారు.

కాగా, శ్రేయస్‌.. గాయం కారణంగా ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌ 2021 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతను‌.. లీగ్‌ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌ పంత్‌కు జట్టు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 10న ఢిల్లీ.. తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఢీకొంటుంది.

మరిన్ని వార్తలు