సూర్యకుమార్‌పై పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

23 Oct, 2022 08:45 IST|Sakshi

మిస్టర్‌ 360గా పేరు తెచ్చుకున్న టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తరపున సూర్యకుమార్‌దే కీలకపాత్ర కానుంది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడే మంత్రంగా జపిస్తున్న సూర్య భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టాపార్డర్‌ విఫలమైనా తాను మాత్రం తగ్గేదేలే అన్న రీతిలో వరుసగా చెలరేగుతూ వస్తున్నాడు.

ఈ ఏడాది టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తొలి స్థానంలో ఉన్న సూర్యకుమార్‌ 34 మ్యాచ్‌ల్లోనే  వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అంతేకాకుండా ప్రస్తుతం టీ20ల్లో రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌ల్లోనూ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఇక ఇవాళ(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడుతుండడంతో అందరి కళ్లు సూర్యకుమార్‌పైనే ఉన్నాయి.

గతేడాది  టి20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో  ఎదురైన పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఆమిర్‌ సోహైల్‌ మాత్రం సూర్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని.. ప్రతీ మ్యాచ్‌లో చెలరేగుతున్న సూర్య పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు.
 
"నేను పాకిస్తాన్‌న్ బౌలర్ల గురించి మాట్లాడుతున్నాను. పాక్ బౌలింగ్ లైనప్ చూసినట్లయితే.. చాలా బలంగా ఉంది. భారత జట్టులో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. ఈ సమయంలో నేను పాకిస్థాన్ కెప్టెన్‌ అయ్యుంటే నా ముందు సూర్యకుమార్ లేదా ఇంకెవరి పేరు ప్రస్తావించినా నాకు పెద్ద ఇబ్బందిగా అనిపించకపోవచ్చు.ఎందుకంటే ప్రతిరోజూ వివ్ రిచర్డ్స్ మాదిరిగా బ్యాటింగ్ చేయలేరు. సూర్యకుమార్‌ కూడా అందరిలాంటి ఆటగాడే. బాగా ఆడుతున్న ఆటగాడు కీలక మ్యాచ్‌లో విఫలమయ్యే అవకాశాలుంటాయి. అయితే నా దృష్టిలో కోహ్లీ ప్రమాదకర ప్లేయర్.. ఆ తర్వాత రోహిత్ శర్మ " అంటూ  పేర్కొన్నాడు.

చదవండి: హార్దిక్‌ పాండ్యాకు ఏమైంది.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటేనా!

దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్‌ కొట్టదు

మరిన్ని వార్తలు