పొట్టి క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్గా మారాడు. ఆడింది తక్కువ మ్యాచ్లే (41) అయినా రికార్డుల రారాజుగా తయారయ్యాడు. మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (నవంబర్ 20) జరిగిన రెండో టీ20లో విధ్వంసకర శతకం (51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 నాటౌట్) బాదిన సూర్య.. మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్లో రెండో శతకం బాదిన సూర్యకుమార్..
సూర్యకుమార్.. తన టీ20 కెరీర్లో 39 ఇన్నింగ్స్ల్లో 181.64 స్ట్రయిక్ రేట్తో 45 సగటున 1395 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, సూర్యకుమార్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా తొలి టీ20 పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సూర్యకుమార్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఛేదనలో ఆది నుంచే తడబడిన కివీస్.. దీపక్ హుడా (4/10), చహల్ (2/26), సిరాజ్ (2/24), సుందర్ (1/24), భువనేశ్వర్ (1/12) ధాటికి 18.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది.