ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. కంగ్రాట్స్‌ సూర్య 

21 Feb, 2021 14:17 IST|Sakshi

ఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌, ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాటియాలకు కూడా చోటు దక్కింది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాళ్లు వీరిని అభినందిస్తూ ట్వీట్స్‌ చేశారు.

'ఇన్నాళ్ల నిరీక్షణ ఫలించింది. కంగ్రాట్స్‌ సూర్య.. అలాగే ఇషాన్‌ కిషన్‌, తెవాటియాలకు కూడా నా అభినందనలు' అంటూ మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్వీట్‌ చేశాడు. టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా స్పందించాడు. 'సూర్యను టీమిండియాలో చూడాలనేది ఫైనల్‌గా నెరవేరింది.. గుడ్‌ లక్‌ సూర్య.. ఆల్‌ ది బెస్ట్‌' అని ట్వీట్‌ చేశాడు. ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ తెవాటియా, సూర్యకుమార్‌ యాదవ్‌లకు ఇవే నా అభినందనలు.. టీమిండియాలో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఆర్‌పీ సింగ్‌ ట్వీట్‌ చేశాడు.

కాగా గతేడాది జరిగిన ఐపీఎల్‌ సీజన్‌లో సూర్య కుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌‌ తెవాటియాలు  అదరగొట్టే ప్రదర్శన చేశారు.ముంబై ఇండియన్స్‌ తరపున సూర్యకుమార్‌ 16 మ్యాచ్‌ల్లో 480 పరుగులు చేయగా.. ఇషాన్‌ కిషన్‌ 14 మ్యాచ్‌ల్లో 516 పరుగులతో దుమ్మురేపాడు. ఇక రాజస్తాన్‌ తరపున ఆడిన రాహుల్‌ తెవాటియా 14 మ్యాచ్‌ల్లో 255 పరుగులతో పాటు 10 వికెట్లు తీశాడు. కాగా విజయ్‌ హజారే ట్రోపీలో శనివారం జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ 94 బంతుల్లోనే 173 పరుగుల తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు.. 11 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ మార్చి 12 నుంచి జరగనుంది.
చదవండి: సూర్య కుమార్, తెవాటియాలకు చాన్స్‌
ఇషాన్‌ కిషన్‌ విశ్వరూపం 

మరిన్ని వార్తలు