Syed Mushtaq Ali Trophy: ఓటమితో ఆంధ్ర ముగింపు

23 Oct, 2022 06:07 IST|Sakshi

ఇండోర్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ ట్రోఫీ టి20 క్రికెట్‌ టోర్నీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. శనివారం జరిగిన గ్రూప్‌ ‘డి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర 11 పరుగుల తేడాతో బరోడా చేతిలో ఓడిపోయింది. ఏడు జట్లున్న గ్రూప్‌ ‘డి’లో ఆంధ్ర రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో ఆంధ్ర 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు అర్హత సాధించలేకపోయింది.

బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. కరణ్‌ షిండే (26 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్‌ (26 బంతుల్లో 37; 6 ఫోర్లు) రాణించారు. అంతకుముందు బరోడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ఐదు గ్రూపుల్లో ‘టాపర్‌’గా నిలిచిన ముంబై, పంజాబ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, బెంగాల్‌ నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత సాధించాయి. మూడు ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో గెలిచిన మరో మూడు జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుతాయి. 

మరిన్ని వార్తలు