ఆ జెర్సీ వేసుకోవడం థ్రిల్‌ కలిగించింది: నటరాజన్‌

20 Mar, 2021 10:43 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో టి. నటరాజన్‌ తన ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే స్వదేశానికి తిరిగొచ్చాకా గాయపడడంతో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా ఎన్‌సీఏ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టులో పాసైన నటరాజన్‌ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. కాగా నటరాజన్ గురువారం టీమిండియా జట్టుతో కలిశాడు.‌  ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ ట్విటర్‌ వేదికగా టీమిండియా జెర్సీని ధరించి ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు.

'మనకు నచ్చిన జాబ్‌లో ఉంటే జీవితంలో ఒక్కరోజు కూడా పని చేయకుండా ఉండలేం.. చాలా రోజుల తర్వాత బ్లూ జెర్సీ వేసుకోవడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. అంటూ కామెంట్‌ చేశాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు నటరాజన్‌తో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌, ప్రసిద్ద కృష్ణ కూడా తుది జట్టులోకి ఎంపికయ్యారు. కాగా ఐపీఎల్‌ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరపున 16 వికెట్లతో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొని అందరి ప్రశంసలు పొందాడు.

ఈ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని ఆసీస్‌ పర్యటనకు అతన్ని నెట్‌ బౌలర్‌గా అవకాశం కల్పించింది. అయితే అనూహ్యంగా నవదీప్‌ సైనీ గాయపడడంతో నటరాజన్‌కు అదృష్టం తలుపు తట్టింది. అలా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేతో ఎంట్రీ ఇచ్చిన నటరాజన్‌ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌లో మొత్తంగా ఆరు వికెట్లు (3,2,1) తీసి అందరి చేత ప్రశంసలు పొందాడు. ఇక గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఆడిన నటరాజన్‌ తొలి టెస్టులోనే 3 వికెట్లు తీసి తానేంటో నిరూపించాడు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ మార్చి 23 నుంచి జరగనుంది.
చదవండి:
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌: నటరాజన్‌ డౌటే!

మరిన్ని వార్తలు