T20 WC 2021 IND Vs PAK: ఆ ఇద్దరు టీమిండియా క్రికెటర్ల నుంచే పాక్‌కు ముప్పు.. పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌

21 Oct, 2021 21:44 IST|Sakshi

Pakistan Has Major Threat From KL Rahul And Pant Says Matthew Hayden: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా భారత్‌-పాక్‌ జట్ల మధ్య ఈ నెల 24న జరగబోయే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌పై పాక్‌ బ్యాటింగ్‌ సలహాదారు, ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ల నుంచే పాక్‌కు ప్రధాన ముప్పు పొంచి ఉందని హెచ్చరించాడు. రాహుల్‌ ముప్పు నుంచి తప్పించుకుంటే.. రిషబ్‌ పంత్‌ రూపంలో మరో ఉపద్రవం కాసుకుని ఉంటుందని అలర్ట్‌ చేశాడు. వీరిద్దరూ ప్రత్యర్ధి ఎవరైనా విచక్షణారాహిత్యంగా విరుచుకుపడతారని, ఇది పాక్‌కు చాలా ప్రమాదమని, వీరిని త్వరగా పెవిలియన్‌కు పంపగలిగితే పాక్‌ సగం విజయం సాధించినట్లేనని అభిప్రాయపడ్డాడు. 

ఇదే సందర్భంగా ఆయన పాక్‌ సారధి బాబర్‌ ఆజమ్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్‌ ఆజమ్‌ గొప్ప నాయకుడని.. ధోని, ఇయాన్‌ మోర్గాన్‌లా అతడు కూడా జట్టును సమర్ధవంతంగా నడిపించగలడని అన్నాడు. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అంటే సహజంగానే ఇరు జట్ల కెప్టెన్లపై ఒత్తిడి ఉంటుందని, అయితే ఈసారి ఇది బాబర్‌పై కాసింత ఎక్కువగానే ఉందని పేర్కొన్నాడు. బాబర్‌ ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా భారత బౌలర్లు అతన్నే టార్గెట్‌గా చేసుకుంటారని, ఈ విషయంలో పాక్‌ సారధి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించాడు.   

కాగా, పాక్‌తో పోరుకు ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే ఊపులో అక్టోబర్‌ 24న దాయాది పాక్‌ను సైతం మట్టికరిపించాలని కోహ్లి సేన భావిస్తోంది. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. ఈ మెగా టోర్నీలో భారత్‌.. పాక్‌ చేతిలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. 
చదవండి: తృటిలో తప్పించుకున్న పపువా; టి 20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యల్ప స్కోర్లు
 

మరిన్ని వార్తలు