T20 WC 2021 IND Vs PAK: 'ఆటగాళ్లను గౌరవించండి..' షమీకి మద్దతుగా ట్వీట్‌ చేసిన పాక్ ఓపెనర్

26 Oct, 2021 20:50 IST|Sakshi

Pak Opener Mohammad Rizwan Tweets In Support Of Shami: టీ20 ప్రపంచకప్-2021‎లో టీమిండియా పాక్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న అనంతరం భారత పేసర్‌ మహ్మద్‌ షమీని టార్గెట్‌ చేస్తూ కొందరు దురభిమానులు సోషల్‌మీడియా వేదికగా మాటల దాడికి దిగిన సంగతి తెలిసిందే. పాక్‌ చేతిలో ఓటమికి షమీనే కారణమని, అతడు పాక్‌కు అమ్ముడుపోయాడని, షమీని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌ స్టార్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ షమీకి మద్దతుగా నిలిచాడు. ట్విటర్‌ వేదికగా ఓ అద్భుతమైన మెసేజ్‌ని షేర్‌ చేశాడు.

దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఆటగాడు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటాడని.. ఈ క్రమంలో ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేస్తాడని పేర్కొన్నాడు. షమీ ప్రపంచపు అత్యుత్తమ బౌలర్లలో ఒకడని.. అలాంటి ఆటగాడిని గౌరవించుకోవాలి కాని​ దూషించకూడదని హితవు పలికాడు. క్రికెట్‌ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలి కాని, విభజించకూడదంటూ షమీ ఫోటోను పోస్ట్‌ చేస్తూ ట్వీటాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది.

షమీకి అండగా నిలిచి అద్భుతమైన మెసేజ్‌ను షేర్‌ చేసిన రిజ్వాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇదే విషయమై భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు షమీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, పాక్‌తో జరిగిన మ్యాచ్‌ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 3.5 ఓవర్లు బౌల్‌ చేసిన షమీ ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. 
చదవండి: టీమిండియాపై పాక్‌ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్‌ తొలగింపు

మరిన్ని వార్తలు