T20 WC 2022: ఇంగ్లండ్‌తో సమరం.. అన్నింటా టీమిండియాదే పైచేయి.. రికార్డులే సాక్ష్యం

9 Nov, 2022 10:52 IST|Sakshi

ఇంగ్లండ్‌తో రేపు (నవంబర్‌ 10) జరుగబోయే సెమీస్‌ సమరంలో టీమిండియానే కచ్చితంగా విజయం సాధిస్తుందని ఇంగ్లండ్‌ అభిమానులు మినహా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అంచనా వేస్తుంది. వీరి నమ్మకానికి టీమిండియా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ ఒక కారణమైతే.. గత రికార్డులు మరో కారణం. బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌లు వరుస హాఫ్‌సెంచరీలతో చెలరేగి పోతుంటే.. బౌలర్లు అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, హార్ధిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌ తమ పాత్రలను న్యాయం చేస్తూ టీమిండియా వరుస విజయాలు సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారత ఆటగాళ్లు సూపర్‌ ఫామ్‌కు, అనూకూలంగా ఉన్న గత రికార్డులు తోడవ్వడంతో టీమిండియాదే విజయమని అందరూ బలంగా నమ్ముతున్నారు. 

గత రికార్డులను పరిశీలిస్తే.. టీ20 ఫార్మాట్‌ ముఖా ముఖి పోరులో ఇరు జట్లు 22 సార్లు తలపడగా.. భారత్‌ 12 సార్లు, ఇంగ్లండ్‌ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు 3 సార్లు (2007, 2009, 2012) ఎదురెదురుపడగా.. టీమిండియా 2, ఇంగ్లండ్‌ ఒక్క సందర్భంలో గెలుపొందాయి. మరోవైపు మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌లో ఇంగ్లండ్‌కు చెత్త రికార్డు ఉండటం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశం.

ఈ వేదికపై ఇంగ్లండ్‌ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఈ వేదికపై ఆడిన ఒకే ఒక టీ20లో (2011) ఆతిధ్య జట్టుపై అతికష్టం మీద గెలువగలిగింది. ఈ రికార్డులే కాక, అడిలైడ్‌లో కోహ్లి వ్యక్తిగత రికార్డులు, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే వేదికపై  బంగ్లాదేశ్‌పై విజయం, ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఈ వేదికపై ఆడిన అనుభవం లేకపోవడం టీమిండియాకు అదనంగా కలిసొచ్చే అంశాలు.

మరోపక్క టీమిండియాను కూడా మూడు సమస్యలు కలవరపెడుతున్నాయి. రోహిత్‌ శర్మ ఫామ్‌, దినేశ్‌ కార్తీకా లేక రిషబ్‌ పంతా అని ఎటూ తేల్చుకోలేకపోవడం, స్పిన్నర్ల వైఫల్యం.. ఈ మూడు అంశాలు టీమిండియాకు అందోళన కలిగిస్తున్నాయి. రేపటి మ్యాచ్‌లో భారత్‌.. ఈ మూడింటిని అధిగమించగలిగితే టీమిండియాను అడ్డుకోవడం దాదాపుగా అసాధ్యం.  
చదవండి: అడిలైడ్‌ అంటే కోహ్లికి 'పూనకం' వస్తుంది.. ఇక ఇంగ్లండ్‌కు చుక్కలే..!

Poll
Loading...
మరిన్ని వార్తలు