T20 WC 2022: టీమిండియాతో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌.. విధ్వంసకర ప్లేయర్‌ ఔట్‌

7 Nov, 2022 16:27 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 కీలక దశలో ఇంగ్లండ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్‌ డేవిడ్‌ మలాన్‌ గజ్జల్లో గాయం కారణంగా టీమిండియాతో జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. నవంబర్‌ 1న శ్రీలంకతో జరిగిన గ్రూప్‌-1 రెండో సెమీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌లో గాయపడిన మలాన్‌.. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ కూడా చేయలేకపోయాడు. టీమిండియాతో జరిగే సెమీస్‌ మ్యాచ్‌కు ఫిట్‌గా లేడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు వెల్లడించారు. మలాన్‌ స్థానాన్ని ఫిల్‌ సాల్ట్‌ రీప్లేస్‌ చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

కాగా, పొట్టి క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్లలో ముఖ్యుడై మలాన్‌.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటలేకపోయాడు. ఐర్లాండ్‌ చేతిలో పరాభవం ఎదురైన మ్యాచ్‌లో చేసిన 35 పరుగులే అతని అత్యధిక స్కోర్‌గా ఉంది. టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌ నుంచి ఆరో స్థానానికి పడిపోయిన మలాన్‌ జట్టులో లేకపోవడం ఇంగ్లండ్‌ విజయావకాశాలపై తప్పక ప్రభావం చూపుతుందని ఆ దేశ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే, గ్రూప్‌-1 నుంచి రెండో సెమీస్‌ బెర్త్‌ ఖారారు చేసుకున్న ఇం‍గ్లండ్‌.. నవంబర్‌ 10న టీమిండియాతో సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. అంతకుముందు తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్‌ 13న ఫైనల్‌ జరుగుతుంది.

>
Poll
Loading...
మరిన్ని వార్తలు