దినేశ్‌ కార్తీక్‌కు భారీ ఊరట.. అయినా పంత్‌కు లైన్‌ క్లియర్‌..!

31 Oct, 2022 18:50 IST|Sakshi

T20 WC 2022 IND VS BAN: టీ20 వరల్డ్‌కప్‌-2022లో టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా వెన్నునొప్పి కారణంగా మైదానం వీడిన దినేశ్‌ కార్తీక్‌.. నవంబర్‌ 2న బంగ్లాదేశ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఆడేది అనుమానమేనని టీమిండియా మేనేజ్‌మెంట్‌లోని కీలక వ్యక్తి ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌కు సమాచారం అందించాడు.

దినేశ్‌ కార్తీక్‌ గాయం తీవ్రమైనది కానప్పటికీ.. బంగ్లాతో మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో ఉండడని సదరు అధికారి తెలిపాడు. డీకే స్థానంలో ఆల్టర్‌నేట్‌ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ జట్టులోకి వస్తాడని పరోక్ష సంకేతాలు పంపాడు. ఒత్తిడి కారణంగా తలెత్తిన సాధారణ వెన్నునొప్పితోనే డీకే బాధపడ్డాడని.. టీమిండియా ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు అతను తిరిగి అందుబాటులోకి వస్తాడని పేర్కొన్నాడు. 

మొత్తానికి డీకేకు పాక్షిక విరామమివ్వడంతో పంత్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. బంగ్లాదేశ్‌తో పోరులో అతను సత్తా చాటితే తిరిగి జట్టులో కదురకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో డీకే ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు కాబట్టి.. పంత్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్‌.. దారుణంగా నిరాశపర్చి విమర్శలపాలైన నేపథ్యంలో పంత్‌ తనను తాను నిరూపించుకునేందుకు ఇది గోల్డెన్‌ ఛాన్స్‌ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే, గ్రూప్‌-2లో భాగంగా దక్షిణాఫ్రికాతో నిన్న (అక్టోబర్‌ 30) జరిగిన కీలక సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన కార్తీక్‌.. భారత ఫీల్డింగ్‌ సమయంలో వెన్నునొప్పి కారణంగా ఆర్ధాంతంగా మైదానాన్ని వీడాడు. పాక్‌తో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అతను.. సౌతాఫ్రికాపై ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. కాగా,  గ్రూప్‌-2లో ప్రస్తుతం టీమిండియా రెండో స్థానంలో నిలిచి సెమీస్‌ రేసులో బలంగా ముందుకు కదులుతుంది. 
 

Poll
Loading...
మరిన్ని వార్తలు