T20 WC 2022 Final: అఫ్రిది గాయపడకుంటే టైటిల్‌ గెలిచేవాళ్లం: పాక్‌ కెప్టెన్‌

14 Nov, 2022 12:02 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం అనంతరం, పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. పాక్‌ ఓటమికి షాహీన్‌ అఫ్రిది గాయపడటమే ప్రధాన కారణమని, పరాభవాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. అఫ్రిది గాయపడినప్పటికీ, తమ బౌలర్లు అసాధారణ పోరాటపటిమ కనబర్చారని, ప్రపంచంలోనే తమ బౌలింగ్‌ విభాగం అత్యుత్తమమైందని గొప్పలు పోయాడు.

బ్యాటింగ్‌లో మరో 20 పరుగులు చేసి ఉంటే, కథ వేరేలా ఉండేదంటూ ఓటమి బాధలో పిచ్చి వాగుడు వాగాడు. వెంటనే టాపిక్‌ డైవర్ట్‌ చేస్తూ.. ఇంగ్లండ్‌ ఛాంపియన్‌ జట్టులా ఆడిం‍ది, వారు విజయానికి అర్హులు అంటూ లేని పరిణితిని ప్రదర్శించాడు. ప్రపంచకప్‌లో ఫైనల్‌ వరకు సాగిన మా జర్నీ అద్భుతమని, అంతిమ పోరులో శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, విజయం తమకు దక్కలేదని ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. 

కాగా, ఇంగ్లండ్‌ జట్టు 30 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో అఫ్రిది మోకాలి గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. అఫ్రిది గాయం తీవ్రమైంది కావడంతో  అతను తిరిగి బరిలోకి దిగలేకపోయాడు. అప్పటికి అతను ఇంకా రెం‍డు ఓవర్లు వేయాల్సి ఉండింది. ఒకవేళ అఫ్రిది బరిలో ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేని పరిస్థితి.

ఇదిలా ఉంటే, మెల్‌బోర్న్‌ వేదికగా నిన్న (నవంబర్‌ 13) జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌.. పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌.. బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లు సామ్‌ కర్రన్‌ 3 వికెట్లు, ఆదిల్‌ రషీద్‌, క్రిస్‌ జోర్డన్‌ తలో 2 వికెట్లు, స్టోక్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్నప్పటికీ, బెన్‌ స్టోక్స్‌ (52) అజేయమైన అర్ధసెంచరీతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చడంతో పాటు ఇంగ్లండ్‌ను రెండోసారి జగజ్జేతగా నిలబెట్టాడు. 
చదవండి: మొయిన్‌ అలీ, రషీద్‌ విషయంలో బట్లర్‌ పెద్ద మనసు
 

మరిన్ని వార్తలు