T20 WC 2022: టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్‌ రికార్డ్స్‌

12 Nov, 2022 11:28 IST|Sakshi

Guinness World Records: టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ దారుణంగా అవమానించింది. ప్రపంచం నలుమూలల్లో జరిగే ప్రతి అంశంలో అత్యుత్తమ, అతి దారుణమైన విశేషాలను తమ రికార్డుల్లో నమోదు చేసే ఈ సంస్థ.. నవంబర్‌ 10న ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా ఓటమిని అతి దారుణంగా వర్ణిస్తూ.. క్రికెట్‌ చరిత్రలో అత్యంత సునాయాసమైన లక్ష్య ఛేదన అంటూ ట్వీట్‌ చేసి భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది.

దీనిపై భారత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా ఆ సంస్థను ఓ ఆటాడుకుంటున్నారు. భారతీయుల మనో భావాలను దెబ్బతీసిన ఈ సంస్థను ఇండియాలో బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లు శక్తివంచన లేకుండా అత్యుత్తమ ఆటతీరు కనబర్చారని భారత క్రికెటర్లను వెనకేసుకొస్తున్నారు.

ఇంత కంటే దారుణ పరాజయాలు క్రికెట్‌ చరిత్రలో చాలానే ఉన్నాయని రివర్స్‌ కౌంటరిస్తున్నారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌.. యూకే సంస్థ కాబట్టి, గొప్పలకు పోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఫైనల్లో పాక్‌పై ఎలా గెలవాలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ట్రైనింగ్‌ ఇవ్వండి అంటూ సలహాలిస్తున్నారు. 

కాగా, టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించినప్పటికీ, అదృష్టం కలిసి రాక సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. సూపర్‌-12 దశలో ఒక్క దక్షిణాఫ్రికాతో మినహా అన్ని జట్లపై అద్భుత విజయాలు సాధించి గ్రూప్‌-2లో అగ్రస్థానంతో సెమీస్‌కు చేరిన భారత్‌.. సెమీస్‌లో అనూహ్యంగా ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా, ఛేదనలో ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఆటగాళ్లు విరాట్‌ (50), హార్ధిక్‌ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లండ్‌ ఓపెనర్లు బట్లర్‌ (80), హేల్స్‌ (86) అజేయమైన అర్ధశతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. 
చదవండి: హేల్స్‌ రెచ్చిపోతే.. పాక్‌ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు..!

Poll
Loading...
మరిన్ని వార్తలు